50 మందిని చంపాలని కుట్ర... పవన్ సంచలన వ్యాఖ్యలు!
ఇందులో భాగంగా చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలిస్తున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్ పై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు
By: Tupaki Desk | 11 Sept 2023 10:04 AM ISTపవన్ కల్యాన్ ఏపీకి వచ్చే సమయంలో జరిగిన ఆంక్షలతో హర్ట్ అయ్యారో.. లేక, చంద్రబాబు అరెస్టుతో ఫీల్ అయ్యారో తెలియదు కానీ... ఉన్నఫలంగా బరస్ట్ అయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలిస్తున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్ పై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... తాను జైలుకు వెళ్లాను కాబట్టి అందరూ జైలుకు వెళ్లాలనేలా జగన్ తీరు ఉందని.. ఆయన క్రిమినల్ ఆలోచనలు కలిగిన వ్యక్తి అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. చట్టాలు సంపూర్ణంగా పని చేసి ఉంటే జగన్ అనే వ్యక్తి జన్మలో ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని చెప్పుకొచ్చారు. నిజంగా రాష్ట్రానికి ఇవి చీకటి రోజులని.. ప్రజలందరూ మేల్కోవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు.
ఇక, వారాహి యాత్రలో భాగంగా భారీ కుట్ర జరిగిందని ఇప్పుడు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు పవన్. ఇందులో భాగంగా... తన వారాహి యాత్ర సమయంలో కోనసీమలో అల్లర్లు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూశారని.. దానికోసం 2 వేల మంది నేరగాళ్లను దింపారని.. కోనసీమ జిల్లాలో 50 మందిని చంపేయాలని పథకం వేశారని పవన్ చెప్పుకొచ్చారు.
అయితే ఈ కుట్ర గురించి తెలుసుకున్న కేంద్రం పెద్దలు దాన్ని నిలువరించారని అన్నారూ. ఇదే సమయంలో రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ప్రతి అక్రమానికి, అన్యాయానికీ వైసీపీ నాయకులు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే అని జోస్యం చెప్పిన పవన్... చేసిన ప్రతి దోపిడీకి సమాధానం చెప్పాల్సిందే అని అన్నారు. ఇదే సమయంలో... ఏపీ సీఎం జగన్ ఇక్కడ దోచుకున్నదంతా లండన్ లో దాచుకుంటున్నారని విమర్శించారు.
ఇదే క్రమంలో తాను ఈ సమయంలో టీడీపీకి అండగా ఉండటానికి కారణం ఉందని చెప్పిన పవన్... గతేడాది అక్టోబర్లో విశాఖపట్నంలో జనసేన నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే చంద్రబాబు మద్దతిచ్చారని అన్నారు. ఫలితంగా ఇప్పుడు ఆయనకూ అలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు స్పందించడం మన సంస్కారం అని, దానిలో భాగంగానే మద్దతు ఉంటుందని పవన్ తెలిపారు.
