Begin typing your search above and press return to search.

సత్యసాయి మార్గంలో మోదీ, చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు

భగవాన్ సత్యసాయి శతజయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   19 Nov 2025 7:07 PM IST
సత్యసాయి మార్గంలో మోదీ, చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
X

భగవాన్ సత్యసాయి శతజయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సత్యాసాయి బాబా సేవలకు విశేష గుర్తింపు తీసుకువచ్చిన తాగునీటి పంపిణీ పథకం నుంచి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తి పొందారని పవన్ వ్యాఖ్యానించారు. సత్యసాయి శతజయంత్యుత్సవాలు పుట్టపర్తిలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు బుధవారం ప్రధాని మోదీ పుట్టపర్తి వచ్చారు. ఆయనతోపాటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ పుట్టిపర్తి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ది శాఖ చూస్తున్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ భగవాన్ సత్యాసాయి బాబా సేవలను కొనియాడారు.

‘ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జల్ జీవన్ మిషన్ పథకాన్ని తీసుకువస్తే.. భగవాన్ సత్యసాయి బాబా ఎప్పుడో ఆ పథకానికి అంకురార్పణ చేశారంటూ పవన్ గుర్తు చేశారు. ప్రజలకు తాగునీటి సరఫరాపై ఏ ప్రభుత్వం ఆలోచన చేయని రోజుల్లోనే ఆధ్యాత్మిక గురువుగా ఉన్న సత్యసాయి ప్రజల దాహర్తిని తీర్చారని పవన్ ప్రస్తుతించారు. భగవాన్ సత్యసాయి బాబా ఆలోచనకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకరించారని గుర్తు చేశారు. సత్యసాయి చేపట్టిన సత్కార్యానికి ప్రభుత్వపరమైన అనుమతులను సత్వరం అందేలా చంద్రబాబు చూశారని పవన్ తెలిపారు.

సత్యసాయి ప్రవేశపెట్టిన పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు తమిళనాడు, తెలంగాణల్లో లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందుతోందని చెప్పారు. ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యమైందన్నారు పవన్. “భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గొప్ప ఆధ్యాత్మిక తేజస్సు కలిగిన వారు. మహానుభావులు మాత్రమే అలాంటి జన్మను తీసుకోగలరు. సాయిబాబా వారి గొప్పదనం గురించి మన దేశస్తులకంటే విదేశీయులే ఎక్కువ చెబుతారు. 30 ఏళ్ల క్రితం సింగపూర్ లో చైనీస్ ఇళ్లలో బాబా ఫోటోలు చూశాను. స్టీవెన్ సిగాల్ అనే హాలీవుడ్ నటుడు బాబా గారిని కలవాలన్న తన కోరికను అన్నయ్య చిరంజీవికి చెప్పి ఇక్కడికి వచ్చి బాబా వారి ఆశీర్వచనం తీసుకువెళ్లడం అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. 40 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి విదేశీ భక్తులు వస్తారని, ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారని ఎవరూ ఊహించరు. శ్రీ సత్యసాయి బాబా వారి ఆధ్యాత్మిక శక్తితోనే అది సాధ్యపడింది’’ అంటూ పవన్ తెలిపారు.

బాబా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తాం

‘‘సాయిబాబా సేవాతత్పరతకు ప్రభావితం అయిన వారి సంఖ్య లెక్కలకందదు. పుట్టపర్తి వచ్చి సేవ చేసే ప్రముఖులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సచిన్ టెండూల్కర్ లాంటి ఎంతో మంది ప్రముఖులను బాబా ప్రభావితం చేశారు. అలాంటి అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారత దేశంలో, మన రాష్ట్రంలో, మన అనంతపురం జిల్లాలో పుట్టడం ఎంతో ఆనందం కలిగించే అంశం. ఆయన సేవా స్ఫూర్తిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ముందుకు తీసుకువెళ్తాము అని మాటిస్తున్నా’’ అంటూ పవన్ ప్రకటించారు.

సత్యసాయి మహాసమాధి దర్శనం

అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్లో భగవాన్ సత్యసాయి బాబా మహా సమాధిని పవన్ దర్శించుకున్నారు. బాబా బంగారు విగ్రహం వద్ద నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన రూ.100 స్మారక నాణాన్ని, పోస్టల్ స్టాంపులు ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.