Begin typing your search above and press return to search.

బీసీ చేతిలో లోకేష్ ఓటమి... కన్ ఫర్మ్...!

మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామక్రిష్ణారెడ్డిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం లో వైసీపీ రాజనీతి ఏంటో తెలుస్తోంది

By:  Tupaki Desk   |   20 Feb 2024 4:42 PM GMT
బీసీ చేతిలో లోకేష్ ఓటమి... కన్ ఫర్మ్...!
X

నారా లోకేష్ ఎమ్మెల్యే ఈసారి కూడా కాలేడా. ఆయన గెలుపు మీద మరోసారి నీలి నీడలు కమ్ముకుంటున్నాయా అంటే ప్రత్యర్ధి పార్టీలు ఎపుడూ అదే పని మీద ఉంటాయి. నారా లోకేష్ ని ఓడిస్తే టీడీపీ రాజకీయం పూర్తిగా భూస్థాపితం అవుతుంది అని రాజకీయ చదరంగంలో కీలక పావులను కదుపుతున్నారు. నారా లోకేష్ ఈసారి మంగళగిరిలో యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాను అని ధీమాగా ఉన్నారు.

ఆయన శంఖారావం సభలతో బిజీగా ఉన్నారు. ఆయన పోటీ చేస్తున్న మంగళగిరి అయితే టీడీపీకి రాజకీయంగా అచ్చి వచ్చేది కాదు, పార్టీ పెట్టిన కొత్తలో ఎపుడో ఒకటి రెండు సార్లు గెలిచిన పార్టీ ఆ తరువాత మళ్లీ గెలుపు ముఖం చూడలేదు. అలాంటి సీటులో లోకేష్ 2019లో పోటీ చేయడమే రిస్క్ అనుకుంటే ఆయన ఓడాక మరోసారి అక్కడ నుంచే అంటున్నారు. అయితే లోకేష్ లెక్కలు ఏమిటో తెలియదు కానీ వైసీపీ మాత్రం పక్కాగానే అన్నీ సెట్ చేసుకుని వస్తోంది అని అంటున్నారు.

మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామక్రిష్ణారెడ్డిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం లో వైసీపీ రాజనీతి ఏంటో తెలుస్తోంది. సాధారణంగా పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని తిరిగి జగన్ చేర్చుకోరు. అంత తొందరగా ఆయన వారిని దగ్గరకు తీయరు. కానీ కేవలం మంగళగిరిని దృష్టిలో ఉంచుకునే ఆయన ఆర్కేని తిరిగి రానిచ్చారు అని అంటున్నారు.

దీనిని బట్టి చూస్తే లోకేష్ ని ఓడించాలన్న కసి ఏ రేంజిలో ఉందో అర్ధం అవుతోంది అంటున్నారు. ఇదిలా ఉండగా జగన్ సమక్షంలో వైసీపీలో మరోసారి చేరిన ఆర్కే నారా లోకేష్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. 2019లో ఓసీ అభ్యర్థి చేతిలో ఓడిన లోకేష్ ఈసారి బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలు అవుతారు అని జోస్యం చెప్పారు. ఇది రాసి పెట్టుకోండి అని మీడియాకి కూడా సూచించారు.

వైసీపీకి బలం ఇవ్వాలనే తాను ఆ పార్టీలో చేరినట్లుగా చెప్పారు. వైనాట్ 175 అసెంబ్లీ వైనాట్ 25 లోక్ సభ అన్న వైసీపీ నినాదాన్ని నిజం చేసేందుకే తేను వైసీపీ జెండా మళ్ళీ పట్టుకున్నాను అని అన్నారు. జగన్ మరో 20 నుంచి 30 ఏళ్ల పాటు సీఎం గా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పేదలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగకూడు అన్నదే విపకాల కోరిక అని అన్నారు.

ఆనాడు 2009లో అన్ని పార్టీలూ కూటమి కట్టి వచ్చాయని ఈసారి కూడా అలాగే వస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే తన అవసరం ఎక్కడెక్కడ ఉందో అక్కడికి వెల్లి తాను పార్టీకి ప్రచారం చేసి పెడతాను అని ఆయన అన్నారు. వైసీపీలో చేరిన ఆళ్ళ చేసిన ఈ సంచలన కామెంట్స్ ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి. మొత్తానికి చూస్తే సర్వశక్తులూ ఒడ్డి నారా లోకేష్ ని ఓడించాలని గట్టి ప్రయత్నమే వైసీపీ చేస్తోంది అని అర్ధం అవుతోంది.