Begin typing your search above and press return to search.

లోకేష్ 2.0 : విపక్షాలకు అంతుచిక్కని వ్యూహకర్త!

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన నారా లోకేశ్ కు ఆ పదవి అంత ఈజీగా దక్కలేదు.

By:  Tupaki Desk   |   16 April 2026 12:30 AM IST
లోకేష్ 2.0 : విపక్షాలకు అంతుచిక్కని వ్యూహకర్త!
X

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన నారా లోకేశ్ కు ఆ పదవి అంత ఈజీగా దక్కలేదు. తనను తాను నిరూపించుకున్న తర్వాతే 45 ఏళ్ల పార్టీకి కార్యనిర్వాహక పగ్గాలు అప్పగించడానికి అధినాయకత్వం అంగీకరించింది. తండ్రి అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి వారసత్వంగా లోకేశ్ కు పదవి దక్కితే పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ, లోకేశ్ వారసుడి కోటాలో పదవి దక్కలేదు. నాయకుడిగా సమర్థత చాటుకున్న తర్వాతే పార్టీ బాధ్యతలు అప్పగించడానికి మార్గం సుమగం అయింది. ఈ ప్రయాణంలో మూడేళ్ల క్రితం వరకు లోకేశ్ తీరు వేరు. ఎప్పుడైతే యువగళం పాదయాత్రతో జనం మధ్యకు వచ్చారో నాటి నుంచి లోకేశ్ 2.0 చూపించారని అంటున్నారు.

2014-19 మధ్య మంత్రిగా పనిచేయడమే కాకుండా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన లోకేశ్ ఇంటా బయటా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన సమర్థతపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తిన ప్రత్యర్థులు, అత్యంత హీనంగా బాడీ షేమింగ్ చేశారు. కానీ, ఆయన ఎప్పుడూ ప్రత్యర్థుల కామెంట్లకు కుంగిపోలేదు. పడిన ప్రతిసారి అంతకు రెట్టించిన వేగంతో పైకి ఎదిగినట్లు నిరూపించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో లోకేష్ తీవ్రమైన వ్యక్తిగత విమర్శలను ఎదుర్కొన్నారు. ఆయన రూపంపై, మాటతీరుపై ప్రత్యర్థులు ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అత్యంత హేయంగా హేళన చేశారు. అయితే, ఆ బాడీ షేమింగ్‌ను ఏనాడూ పట్టించుకోని లోకేశ్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు, వ్యక్తిత్వాన్ని మెరుగు పరుచుకున్నారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి తనలోని పట్టుదలను నిరూపించుకున్నారు. అవమానాలనే పునాదిగా చేసుకుని, అజేయమైన నాయకుడిగా ఎదిగారు.

ప్రత్యర్థులకు వణుకు పుట్టించిన రెడ్ బుక్

ఎన్నికల ముందు లోకేష్ పట్టుకున్న 'రెడ్ బుక్' కేవలం ఒక డైరీ కాదు.. అరాచకాలకు పాల్పడిన వారికి అదొక హెచ్చరిక. అధికారంలోకి వచ్చాక లోకేష్ చాలా సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు. అనవసరమైన హడావుడి లేకుండా, చట్టం తన పని తాను చేసేలా చూస్తూ, తప్పు చేసిన వారు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదని నిరూపిస్తున్నారు. ఈ 'సైలెంట్ బట్ వయలెంట్' అప్రోచ్ ఇప్పుడు ప్రత్యర్థులకు పెద్ద సవాలుగా మారింది.

'అమ్మ'పై మాటొస్తే.. తగ్గేదే లే!

రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తన తల్లిని టార్గెట్ చేసినప్పుడు లోకేష్ చూపించిన తెగువ ఆయనలోని ఎమోషనల్ అండ్ సీరియస్ సైడ్‌ను బయటపెట్టింది. "నా తల్లి జోలికి వచ్చిన వారిని వదిలిపెట్టను" అని ఆయన ఇచ్చిన వార్నింగ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేవలం మాటలతో సరిపెట్టకుండా, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడంలో ఆయన చూపిస్తున్న చొరవ కార్యకర్తలకు కొత్త ధైర్యాన్ని ఇచ్చింది.

కార్యకర్తలకు ధైర్యం

పాదయాత్రలో లోకేష్ పేల్చిన పంచ్ డైలాగులు ఒక ఎత్తు అయితే, కార్యకర్తలకు ఆయన ఇచ్చిన భరోసా మరో ఎత్తు. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న వారి కోసం అండగా నిలబడతానని మాట ఇచ్చి, నేడు అధికారంలో ఉండగా వారి సమస్యలను తీరుస్తున్నారు. కార్యకర్తలతో నేరుగా మమేకమవ్వడం, వారి పేర్లతో సహా గుర్తుంచుకోవడం లోకేష్ ప్రత్యేకంగా చెబుతున్నారు. ఇక లోకేష్‌ను అంచనా వేయడంలో విపక్షాలు ఇప్పటికీ క్లారిటీ లేదని అంటున్నారు.