Begin typing your search above and press return to search.

ఉచితాలకు మోడీ నో... బాబు వరాల జల్లులు చెల్లెదెలా...?

మరి మోడీ ఉచితాలకు యాంటీగా ఉంటే కూటమి మాత్రం ఉచిత వర్షం కురిపిస్తే ఎలా అన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందా అన్నది మరో చర్చగా ఉంది.

By:  Tupaki Desk   |   15 April 2024 3:33 PM GMT
ఉచితాలకు మోడీ నో... బాబు వరాల జల్లులు చెల్లెదెలా...?
X

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అయితే ఆయన పార్టీ బీజేపీ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో ఎక్కడా ఉచితాల ప్రసక్తి లేదు. అంతా అభివృద్ధి గురించే ఉంది. భారత దేశాన్ని పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థగా ఎలా తీర్చిదిద్దాలన్నదే ఉంది. భారత దేశాన్ని ప్రపంచంలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ఉంది.

భారత్ 2047 నాటికి నంబర్ వన్ కంట్రీగా ఉండాలన్నది బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఉంది. మరి బీజేపీ విధానం ఇలా ఉంది. ఉచితాల మీద నరేంద్ర మోడీ స్ట్రాంగ్ గా వ్యతిరేకిస్తున్నారు. ఉచితాల మీద ఆయన గతంలో చాలా రాష్ట్రాలను హెచ్చరించారు. అవి ఆర్ధికంగా ఖజానాని కృంగదీస్తాయని కూడా చెప్పుకొచ్చారు

ఇపుడు అదే బీజేపీ ఏపీలో టీడీపీ తో జత కడుతోంది. ఈ కూటమి ఉమ్మడిగా ఎన్నికల మేనిఫెస్టో ఇప్పటిదాకా ఇవ్వలేదు. బీజేపీ దేశవ్యాప్తంగా రిలీజ్ చేసిన ఎన్నికల ప్రణాళిక చూస్తే తెలుగుదేశం మేనిఫెస్టో ఉల్టాగా ఉంది. మరి ఉచితాలు అంటూ వరాల జల్లు కురిపిస్తూ తెలుగుదేశం ఒక మినీ మ్యానిఫెస్టోని జనంలో పెడుతోంది.

దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టింది. అంతే కాదు ఇంకా అసలైన మ్యానిఫెస్టో టీడీపీ బయటకు తీయబోతోంది. దాంట్లో మొత్తం ఉచితాలు అన్నీ ఉంటాయని అంటున్నారు. దీని మీద అపుడే హింట్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలి అంటే ఏకంగా లక్షా నలభై వేల కోట్లు ఏటా ఖర్చు అవుతాయని వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే విడమరచి చెప్పారు. ఇది చాలదన్నట్లుగా ఇంకా మరిన్ని కొత్త హామీలు కనుక తీసుకుని వస్తే మాత్రం కచ్చితంగా అది ఆర్ధికంగా ఇబ్బంది అవుతుందని నిపుణులు అంటున్నారు.

మరి మోడీ ఉచితాలకు యాంటీగా ఉంటే కూటమి మాత్రం ఉచిత వర్షం కురిపిస్తే ఎలా అన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందా అన్నది మరో చర్చగా ఉంది. ఒకవేళ ఉంటే బీజేపీ నేతలు కేవలం ఏపీకి సంబంధించి ఉచితాలకు ఎస్ అని తలూపుతారా అన్నది కూడా చూడాల్సి ఉంది.

ఇలా రాష్ట్రానికి ఒక రాజనీతి అంటే బీజేపీని ఎవరైనా నమ్ముతారా అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఏపీ అప్పుల కుప్పగా ఉంది. కానీ ఉచితాలతో ఏపీని ఇంకా అప్పులతో ముంచేలా చేస్తే కేంద్రంలో పెద్దన్న కూటమి పెద్దన్నగా ఉండే బీజేపీ దాన్ని ఏ విధంగా చూస్తుంది అన్నది కూడా అర్ధం చేసుకోవాలని అంటున్నారు.

ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు విషయం కూడా బీజేపీ తన మ్యానిఫెస్టోలో ప్రస్తావించలేదు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే సీపీఎస్ విషయంలో ఆమోదయోగ్యమైన హామీ ఇస్తామని అంటున్నారు. అలాగే అంగన్ వాడీల సమస్యల విషయంలో కేంద్రం ఏమీ చేప్పలేదు.మరి టీడీపీ జనసేన స్టాండ్ ఏంటి అన్నది చూడాలి. ఏ విధంగా చూసినా కూటమి అంటే ఒకే మాటగా ఉండాలి. ఎవరి దారి వారిదే అంటే జనాలు ఎలా నమ్ముతారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది.

కూటమిలో బీజేపీ అభివృద్ధి అనడమే కాదు ఇచ్చిన హామీలకు కట్టుబడాలని చెబుతోంది.తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ప్రాణం పోయినా హామీలను తప్పకూడదు అని అన్నారు. నేటి రాజకీయాల్లో రాజకీయ నేతలలో విశ్వసనీయత ప్రశార్ధకం అవుతోంది అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ పార్టీల అధినేతలు తాము ఇచ్చిన హామీల విషయంలో మాట నిలబెట్టుకోవాలి ఆ నీతిని అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. మేము మాట ఇస్తే పాటిస్తామని ఆయన చెప్పారు. అందుకే 370 అధికరణను రద్దు చేస్తామని చెప్పి అదే చేసి చూపించామని అంటున్నారు. మొత్తానికి కూటమి పెద్దన్నగా మోడీ చెప్పిన మాటలను బీజేపీ ఎన్నికల మ్యానిఫేస్టోని దృష్టిలో ఉంచుకుని టీడీపీ జనసేన నడవాల్సి ఉంటుందని అంటున్నారు. మరి అది జరుగుతుందా లేక కూటమిలో ఎవరి దారి వారిదేనా ఎవరి రాజకీయ విధానాలు వారిదేనా అని కూడా చర్చ సాగుతోంది.