Begin typing your search above and press return to search.

కాపులకు కేరాఫ్ అడ్రస్ పవన్ కళ్యాణే...!

ఏపీ అంటేనే కులాల సమాహారం. ఆ మాటకు వస్తే దేశంలో కులాలు లేవా అంటే దేశంలో ఎక్కడ ఉన్నా ఇంత పట్టింపు అయితే లేదు

By:  Tupaki Desk   |   19 March 2024 8:06 AM GMT
కాపులకు కేరాఫ్ అడ్రస్ పవన్ కళ్యాణే...!
X

ఏపీ అంటేనే కులాల సమాహారం. ఆ మాటకు వస్తే దేశంలో కులాలు లేవా అంటే దేశంలో ఎక్కడ ఉన్నా ఇంత పట్టింపు అయితే లేదు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చేసరికి మాత్రం కులాలను తప్పనిసరిగా చూస్తారు. కులాల మధ్య సంకుల సమరంగా ఎన్నికలను అంతా అంటూంటారు. ఒక కులం ఓటేస్తే ఒక రాజకీయ పార్టీ గెలుస్తుందా అంటే అలా కానే కాదు.

కానీ ఆ పార్టీ అధినేతను చూసి తమ కులానికి ఆపాదించుకుంటారు. సొంతం చేసుకుంటారు. ఆ పార్టీ వెంట ఎక్కువ మంది నడుస్తారు. అలా చూసుకుంటే గతంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో ఉన్నపుడు రెడ్ల పార్టీ అనేవారు. ఇపుడు విభజన తరువాత కాంగ్రెస్ పెద్దగా ఉనికిలో లేకుండా పోయింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టాక రెడ్లు ఎక్కువగా అటు వైపు వెళ్ళారు. అలా వైసీపీని రెడ్ల పార్టీగా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇక టీడీపీని మొదటి నుంచి అన్ని సామాజిక వర్గాలు ఆదరించాయి. తరువాత కాలంలో ప్రభుత్వ విధానాలు చూశాక కొన్ని కులాలు విభేదించాయి. అయితే బీసీల పార్టీ అని పేరు ఉంది. కానీ కమ్మలు టీడీపీని తమ సొంత పార్టీ అని అంటూంటారు.

ఇక ఏపీలో ఈ విధంగా ప్రధాన పార్టీలు రెండూ ఉంటే కొత్తగా వచ్చిన జనసేనను కూడా మరో బలమైన సామాజిక వర్గం వారు సొంతం చేసుకుంటున్నారా అంటే అది 2019 కంటే 2024లో ఎక్కువగా కనిపిస్తోంది అని అంటున్నారు. పవన్ అంటే కేరాఫ్ కాపులు అన్నట్లుగా వాతావరణం మారింది అని అంటున్నారు. తనకు కులాలు లేవు అని పవన్ అన్నా ఆయన కూడా రాజకీయ వ్యూహాలే చేయాల్సి ఉంటుంది.

అందుకే ఉభయ గోదావరి జిల్లాలలో చూసుకుంటే జనసేనకు మొగ్గు ఉందని అంటున్నారు. మరి ఈ పట్టు ఎలా వచ్చింది అంటే కాపులు జనసేనను సొంత పార్టీగా భావిస్తున్నారు అని అంటున్నారు. అయితే చిత్రంగా ఉత్తరాంధ్రా కాపులకు మాత్రం పవన్ కేరాఫ్ అనిపించడంలేదు అంటున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రాలో తూర్పు కాపులు ఎక్కువ.

ఇక్కడ ఓసీ కాపు బీసీ కాపు అన్న తేడా ఉంది. మొదటి నుంచి ఉత్తరాంధ్రా జిల్లాలు పేదరికంతో ఉంటున్నాయి. తూర్పు కాపులు బీదలుగా ఉంటున్నారు. వారిని బీసీలలో చేర్చారు. అదే సమయంలో గోదావరి జిల్లాల కాపులు సారవంతమైన భూములతో ఓసీ కాపులుగా ఉంటున్నారు. ఈ ఆర్థిక పరమైన సామాజికపరమైన తేడాతో ఉత్తరాంధ్రాలో కాపులు మాత్రం ఓసీ కాపులను కొంత విభేదిస్తూ ఉంటారు అని అంటున్నారు.

అలా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలకు చెందిన కాపులకు మాత్రం కేరాఫ్ గానే మారిపోయారు అని అంటున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలను దాటి దక్షిణ కోస్తా వైపు వెళ్తే నెల్లూరు ప్రకాశం వంటివి అలాగే రాయలసీమ జిల్లాలలో చూస్తే కనుక అక్కడ కాపులను బలిజలుగా పేర్కొంటారు. అయితే ఆ బలిజలకు పవన్ కళ్యాణ్ కి సంబంధాలు లేవు అని అంటున్నారు. బలిజలు పూర్తిగా తమ ఐడియాలజీతో ఉంటారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే వీరు కూడా వెనకబడి ఉంటారు. గోదావరి జిల్లాల కాపులను వీరు ధనవంతులుగా చూస్తారు. దాంతో పాటుగా సామాజిక పరంగా కొంత తేడా చూపిస్తారు అని అంటున్నారు. అందుకే ఈ వైపు జిల్లాలలో మాత్రం బలిజలలో పవన్ ప్రభావం అంతగా ఉండదని అంటున్నారు.

ఇక రాయలసీమ జిల్లాలలో చూసుకుంటే రెడ్ల ప్రాబల్యం ఎక్కువ. అయితే రెడ్లకు ధీటుగా బలిజలు ఉంటూ వస్తున్నా రాజకీయంగా మాత్రం వారు పెద్దగా చురుకుగా లేరు అంటున్నారు. దీంతో మూడు భిన్న ప్రాంతాలలో మూడు రకాలుగా కాపులు ఉన్నా వారి ఆలోచనలలో తేడా ఉంటోంది. మరో వైపు చూస్తే వంగవీటి రంగాకు అప్పట్లో ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా ఆదరణ ఉండేది.

అది ఆయనకు కేవలం కాపుల వల్లనే సాధ్యం కాలేదు. బీసీలు ఎస్సీలు ఇతర బడుగు వర్గాలు కూడా ఆయనను ఆదరించారు అని అంటున్నారు. ఇక చిత్రంగా పవన్ కి గోదావరి జిల్లాలలో కాపులలో ఎక్కువ ఆదరణ దక్కుతోంది. అందులో కూడా యువతరం కాపు యువకులు అయితే పవన్ అంటే మోజు ఎక్కువగా పెంచుకుంటున్నారు. మరి ఈ ప్రభావం ఈసారి రాజకీయంగా ఎంతవరకూ ఉంటుందో ఫలితాలను బట్టి చూడాల్సి ఉంటుంది.