బాబుకు ఆశ్చర్యపరచిన ఫైర్ బ్రాండ్ జేసీ
ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ అన్నా ఆ ఫ్యామిలీ అన్నా పొలిటికల్ గా వేరే లెక్కగా ఉంటుంది.
By: Tupaki Desk | 9 May 2025 3:16 PM ISTఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ అన్నా ఆ ఫ్యామిలీ అన్నా పొలిటికల్ గా వేరే లెక్కగా ఉంటుంది. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ గానే ఉంటారు. తమకు నచ్చని విషయం ఉంటే ఏ పార్టీ అయినా వారు విమర్శలు చేస్తారు. సొంత పార్టీ అయినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారు. అందులో ఏ మాత్రం మొహమాటం ఉండదు.
ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల కాలంలో తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డి రేపిన మాటల మంటలు అన్నీ ఇన్నీ కావు. ఆయనకూ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మధ్యన ఆ మధ్య ఫ్లై యాష్ విషయంలో వచ్చిన వివాదం అందరికీ తెలిసిందే. ఇద్దరూ మాటా మాటా అనుకుని మీడియాకు ఎక్కారు.
ఆ సమయంలో చంద్రబాబు వృద్ధులకు సామాజిక పెన్షన్లు ఇవ్వడానికి అనంతపురం జిల్లాకు వచ్చారు. అయితే జేసీ ప్రభాకరరెడ్డి బాబుకు స్వాగతం పలకకుండా ముఖం చాటేశారు అన్న ప్రచారం సాగింది. ఇక బాబు అయితే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అయిన జేసీ అస్మిత్ రెడ్డికి సొంత పార్టీలో వివాదాలు కూటమిలో గొడవల మీద చిన్నపాటి క్లాస్ ఎయిర్ పోర్టులోనే తీసుకున్నారు అని కూడా ప్రచారం సాగింది.
ఇక కట్ చేస్తే శుక్రవారం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా - అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనుల పరిశీలనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జిల్లా కూటమి నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అందులో విశేషం ఏమీ లేదు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఇద్దరూ కలసి బాబుకు చెరో వైపునా నిలిచి పలికిన స్వాగతమే అందరినీ ఆకర్షించింది.
ఈ సందర్భంగా వెండి పళ్ళెం బాబుకు ఇస్తూ వారు కనిపించారు. అందులో బాబుని కీర్తిస్తూ బాబు ఫోతో ముద్రించిన స్వాగత పత్రం ఉంది. బాబు రాయలసీమలో వెనకబడిన అనంతపురం జిల్లాకు ఆశాకిరణం అని జేసీ ఫ్యామిలీ ఒక ఎత్తు ఎత్తేశారు. అనంతపురం జిల్లాకు సాగు నీరు తాగు నీరు ఇస్తున్న బాబుని గుండెలలో పెట్టుకుంటామని కూడా జేసీ ఫ్యామిలీ పేర్కొంది.
మొత్తానికి చూస్తే జేసీలో భారీ మార్పు కనిపిస్తోందా అన్న చర్చ సాగుతోంది. టీడీపీ అధినాయకుడు చంద్రబాబుతో నవ్వులు చిందిస్తూ ఆయన దిగిన ఫోటోలు చూసిన వారు ఇకనైనా ఫైర్ బ్రాండ్ తీరుని తగ్గించుకుని కూటమిలో సఖ్యతగా ఉంటూ జిల్లాలో సీనియర్ నేతగా తన వంతుగా ముందుకు సాగుతారా అని ఆలోచిస్తున్నారు. అయితే ఆవేశం పాళ్ళు జేసీ బ్రదర్స్ లో హెచ్చు. గతంలో బాబు జిల్లాకు వస్తే ముఖం చాటేసిన జేసీ ఈసారి వచ్చారు అంటే ఆయన పార్టీ లైన్ లోనే ఉంటూ తాను అనుకున్నది చేసేందుకే చొరవ చూపిస్తారు అని అంటున్నారు. చూడాలి మరి తన వదకు వచ్చిన జేసీకి చంద్రబాబు ఏ రకంగా దిశా నిర్దేశం చేసి ఉంటారో. ఆయన ఏ విధంగా ఫ్యూచర్ లో పాటించబోతున్నారో.