Begin typing your search above and press return to search.

జగన్ కి గాయం...సినీ పెద్దలు మౌనం...?

అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, 2019 ఎన్నికల ముందు చాలా మంది సినీ ప్రముఖులు వైసీపీకి మద్దతుగా నిలిచారు.

By:  Tupaki Desk   |   17 April 2024 3:43 AM GMT
జగన్ కి గాయం...సినీ పెద్దలు మౌనం...?
X

ఏపీలో వైసీపీ ప్రభుత్వం విషయంలో తెలుగు సినీ పెద్దల వైఖరి ఏమిటి అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. ఏపీలో గత అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో సినీ రంగానికి పెద్దగా ఒనగూడింది ఏదీ లేదన్న భావన వారిలో ఉందని అంటున్నారు. అదే సమయంలో మొదటి నుంచి సినీ రంగం మద్దతు వైసీపీకి తక్కువే అని అన్న వారూ ఉన్నారు. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, 2019 ఎన్నికల ముందు చాలా మంది సినీ ప్రముఖులు వైసీపీకి మద్దతుగా నిలిచారు.

వారంతా వైసీపీకి అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ఆ తరువాత ఎవరికీ పెద్దగా పదవులు దక్కింది లేదని అంటారు. దాంతో వారంతా తొందరలోనే వైసీపీకి దూరం అయ్యారు. ఇక పోసాని క్రిష్ణ మురళి ఒక్కడే ఈ రోజుకీ వైసీపీ వాయిస్ గా ఉన్నారు. అలీకి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పదవిని ఇచ్చారు. కానీ ఆయన ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటుని కోరుకున్నారు.

కానీ ఆయనకు ఇవ్వలేదు. దాంతో నాటి నుంచి అలీ మౌనంగానే ఉంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గత శనివారం రాత్రి జగన్ మీద రాళ్ల దాడి జరిగింది. దాంతో దేశవ్యాప్తంగా చర్చ సాగింది. దేశ ప్రధాని నుంచి పలువురు ముఖ్యమంత్రుల దాకా అంతా జగన్ కి పరామర్శ చేశారు కోలుకోవాలని ఆకాక్షించారు.

ఏపీలో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు చాలా లేట్ గా రియాక్ట్ అయ్యారు అని వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి. ప్రధాని మోడీ పరామర్శ తరువాతనే బాబు స్పందించారు అని అప్పటికీ ఆయన పార్టీ టీడీపీ కోడి కత్తి డ్రామా అంటూ విమర్శలు చేస్తూనే ఉంది అని గుర్తు చేశారు. ఇక జనసేన అధినేత పవన్ అయితె తెనాలి సభలో జగనే రాయి వేయించుకుని ఉంటారు అని హాట్ కామెంట్స్ చేశారు. దాని మీద సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

ఇవన్నీ పక్కన పెడితే టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ ఒక ముఖ్యమంత్రికి గాయం అయితే ఎందుకు రియాక్ట్ కాలేదు అన్న చర్చ నడుస్తోంది. దానికి కారణం జగన్ ప్రభుత్వం అయిదేళ్ళ కాలంలో సినీ పరిశ్రమను ఇబ్బందులు చాలానే పెట్టిందని అందుకే వారు కీలక వేళలో మౌనం దాల్చారు అని అంటున్నారు.

సినీ ప్రముఖులు అంతా కలసి జగన్ వద్దకు వెళ్లి టాలీవుడ్ సమస్యలు ఏకరువు పెట్టినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని కూడా ఒక రకమైన భావన వారిలో ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే సినీ రంగం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన తరఫున ఈసారి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన అన్న మెగాస్టార్ ఇండైరెక్ట్ గా జనసేన కు మద్దతుగా ఉంటున్నారు.

దాంతో మెగా ఫ్యామిలీ ఎటు వైపో చూసిన వారు అంతా మౌనంగా ఉండడమే బెటర్ అని రియాక్ట్ కాలేదని అంటున్నారు. అదే విధంగా చూస్తే టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి మంచి పలుకుబడి ఉంది. బాలయ్య టీడీపీ తరఫున పోటీ చేస్తూ ప్రచారంలో ఉన్నారు. దాంతో టాలీవుడ్ లో పట్టున్న రెండు వర్గాలు కీలక నటులు అంతా ఒక వైపు ఉండడంతో మిగిలిన వారు కూడా ఎందుకొచ్చిన గొడవ అని జగన్ గాయం విషయంలో మౌనం పాటించారు అని అంటున్నారు.

ఇక చూస్తే ఏపీలో రాజకీయం మారుతుందని అంతా ఆశిస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. అయితే ఒకవేళ రాజకీయం మారకపోతే మాత్రం అపుడు ఎలా ఉంటుంది ఈనాటి మౌనానికి అపుడు సమాధానం ఎలా చెప్పుకుంటారు అన్నది కూడా వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్నలు. ఏది ఏమైనా టాలీవుడ్ కి వైసీపీకి మధ్య గ్యాప్ అయితే బాగానే ఉందని అంటున్నారు. దానికి ఈ ఘటన రుజువుగా ఉందని అంటున్నారు.