Begin typing your search above and press return to search.

జగన్ మీద రెండు సార్లు రాళ్ల దాడి ...!

అయితే దీనికి కోడి కత్తి డ్రామా టూ అని టీడీపీ అఫీషియల్ ట్విట్టర్స్ లో పోస్టులు పెట్టి కామెంట్స్ చేసింది

By:  Tupaki Desk   |   19 April 2024 4:00 AM GMT
జగన్ మీద రెండు సార్లు రాళ్ల దాడి ...!
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత శనివారం విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రను నిర్వహిస్తున్నపుడు ఆయన మీద జరిగిన రాళ్ల దాడితో జాతీయ స్థాయిలొనే సంచలనం రేగింది. ప్రధాని మోడీ సహా పలువురు ముఖ్యమంత్రులు ఇతర కీలక నేతలు అంతా జగన్ పైన జరిగిన దాడిని ఖండించారు. తొందరగా ఆయన కోలుకోవాలని ఆకాంక్షించారు.

అయితే దీనికి కోడి కత్తి డ్రామా టూ అని టీడీపీ అఫీషియల్ ట్విట్టర్స్ లో పోస్టులు పెట్టి కామెంట్స్ చేసింది. పవన్ అయితే జగనే రాళ్ళు వేయించుకుని ఉంటారేమో అని డౌట్ వ్యక్తం చేశారు. మొత్తానికి చూస్తే ఇది దాడి కాదు డ్రామా అని విపక్షాలు సంశయాలు అయితే వ్యక్తం చేశాయి.

ఇదిలా ఉంటే ఈ కేసులో పోలీసులు లోతైన దర్యాప్తు జరిగి అరెస్ట్ దాకా వ్యవహారాన్ని తీసుకుని వచ్చిన తరువాత రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయాలు చూస్తే ఇది డ్రామా కాదు హత్యా యత్నం అని స్పష్టం అవుతోంది అంటున్నారు.

ఈ కేసులో జగన్ మీద రాళ్ళ దాడి చేసిన నిందితుడు సతీష్ ని విచారించిన మీదట విస్తుబోయే నిజాలే వచ్చాయని అంటున్నారు. అవేంటి అంటే జగన్ మీద నిందితుడు సతీష్ ఒకసారి కాదు రెండు సార్లు రాయితో దాడి చేశారు అని రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం విశేషం.

సతీష్ తొలిసారి జగన్ వాహనం డాబా కొట్టు సెంటర్ వద్ద ప్రయాణిస్తున్న సమయంలో రాయి విసిరితే అది తగలలేదుట. అయితే ఆ తరువాత వివేకానంద స్కూల్ సమీపానికి వచ్చి మరోసారి రాయిని గురి చూసి విసిరితే ఈసారి మాత్రం గట్టిగానే తగిలింది అని అంటున్నారు.

ఇక సతీష్ రాయి దాడి చేస్తుండటం చూసి కొందరు పట్టుకునే ప్రయత్నించగా వారిని తప్పించుకుని పారిపోయిన విషయాన్ని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీల్లో కూడా అది లభ్యమయిందని అందులో తెలిపారు.

అలా రెండవసారి విసిరిన రాయి వల్లనే జగన్ నుదిటి మీద తగిలి గాయం ఏర్పడింది. అంటే ఇది ఆకతాయిగా చేసిన పని కాదు అనే పోలీసులు నిర్ధారిస్తున్నారు. అంతే కాకుండా కోపంతో చేసిన దాడి అంతకంటే కాదు అని అంటున్నారు. ఈ రెండిటిలో ఏది జరిగినా ఒకసారి కే పరిమితం అయ్యేది.

కానీ ఒక టాస్క్ ని ఫుల్ ఫిల్ చేయాలన్న ఉద్దేశ్యంతో వరసగా రెండు సార్లు చేసిన దాడి కావడంతో సతీష్ ని ప్రేరేపించిన వారు తెర వెనక సూత్రధారులు ఉన్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇది డ్రామా అని విపక్షాలు అనడం పట్ల వైసీపీ నేతలు ఖండిస్తూనే ఉన్నారు.

మరో వైపు చూస్తే మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బోండా ఉమా కూడా దీని మీద రియాక్ట్ అవుతూ అన్నా క్యాంటీన్ మూసివేశారు అన్న కోపంతో ఆగంతకుడు చేసిన దాడి అని చెప్పారు. అంటే ఇక్కడ బోండా ఉమా చెప్పే విషయం ఏదైనా జగన్ మీద రాయి దాడి ఆయన చేయించుకున్నది కాదని అర్ధం అవుతోంది అంటున్నారు. అదే విషయాన్ని క్రిష్ణా జిల్లా టూర్ లో చంద్రబాబూ చెప్పారు. మందు బిర్యానీ ఇస్తామని చెప్పి సభలకు పిలిపించుకుని మోసం చేయడం వల్లనే ఎవరో కోపంతో దాడి చేశారని దానికీ విపక్షాలకు ఏమిటి సంబంధం అని బాబు ప్రశ్నించారు అన్నట్లుగా వార్తలు వచ్చాయి.

దీనిని బట్టి చూసినా టీడీపీ సహా విపక్షాలు జగనే ఈ దాడి చేయించుకున్నారు అన్న దానికి ఇది పూర్తిగా విరుద్ధమైన వెర్షన్ గానే ఉంది. ఇక్కడికి పోలీసులు చేసిన ప్రాధమిక దర్యాప్తులో వెల్లడి అయింది ఏంటి అంటే సతీష్ దాడి కావాలనే చేశాడు. అయితే ఆయన పాత్రధారి మాత్రమే సూత్రధారులు ఎవరూ అన్నదే పోలీసుల తదుపరి విచారణలో తేలనుంది అంటున్నారు. ఈ కేసులో సంచలన అరెస్టులు ఉంటాయని అంటున్నారు.