Begin typing your search above and press return to search.

లోకేశ్ కు అత్యంత సన్నిహితుడి ఇంట్లో ఐటీ దాడులు

గడిచిన కొంత కాలంగా తెలంగాణతో పాటు.. ఏపీలోని కొందరు నేతల ఇళ్లల్లోనూ.. వారి వ్యాపార సముదాయాల్లోనూ ఐటీ తనిఖీలు నిర్వహించటం తెలిసిందే

By:  Tupaki Desk   |   14 Oct 2023 4:46 AM GMT
లోకేశ్ కు అత్యంత సన్నిహితుడి ఇంట్లో ఐటీ దాడులు
X

రోటీన్ కు కాస్తంత భిన్నమైన సీన్ ఏపీలో చోటు చేసుకుంది. సాధారణంగా ఎక్కడైనా.. ఏ రాష్ట్రంలో అయినా అధికార పక్షానికి చెందిన నేతల వ్యాపారాల్లోనూ.. ఇళ్లల్లోనూ ఐటీ దాడులు జరగటం చూస్తున్నాం. మోడీ జమానాలో ఇలాంటి తీరు మరింత పెరిగిందన్న ఆరోపణలు తెలిసిందే. తాము అధికారంలో లేని రాష్ట్రాల్లోని.. అధికార పార్టీకి చెందిన నేతలపై తరచూ ఐటీ.. ఈడీ దాడులు జరగటాన్ని పలువురు తరచూ విమర్శల రూపంలో చెప్పటం తెలిసిందే.

గడిచిన కొంత కాలంగా తెలంగాణతో పాటు.. ఏపీలోని కొందరు నేతల ఇళ్లల్లోనూ.. వారి వ్యాపార సముదాయాల్లోనూ ఐటీ తనిఖీలు నిర్వహించటం తెలిసిందే. ఇదంతా కావాలనే చేస్తున్నారని అధికార బీఆర్ఎస్ ఆరోపించటం.. దీనిపై ఎలాంటి ఖండనలు లేకపోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈసారి ఏపీలో కాస్తంత భిన్నమైన సీన్ చోటు చేసుకుంది.

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేతగా వ్యవహరిస్తున్న గుణ్ణం చంద్రహౌళి నివాసంలో ఐటీ దాడులు జరగటం ఆసక్తికరంగా మారాయి. అటు విశాఖపట్నం.. ఇటు హైదరాబాద్ నుంచి రెండు టీంలు కాకినాడకు వచ్చాయి. చంద్రమౌళి నివాసంతో పాటు.. ఆఫీసుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగాపలు ఫైళ్లు.. కంప్యూటర్లోని డేటాను పరిశీలించారు.

చంద్రమౌళి నివాసంలో నిర్వహించిన ఐటీ దాడులు ఆసక్తికరంగా మారాయి. కారణం.. టీడీపీ కీలక నేత అయిన నారా లోకేశ్ కు ఇతడు అత్యంత సన్నిహితంగా ఉంటారు. గడిచిన పన్నెండేళ్లుగా సివిల్ కాంట్రాక్టర్ గా చంద్రమౌళి నియోజకవర్గంలో బాగా పాపులర్. ఓపక్క సివిల్ కాంట్రాక్టు వర్కులు చేసుకుంటూనే.. మరోవైపు అక్వా రంగంతో పాటు మెటల్ క్వారీల్ని నిర్వహిస్తున్నట్లు చెబుతారు. ఇదిలా ఉంటే.. లోకేశ్ కు అత్యంత సన్నిహితుడి ఇంట్లోనూ.. ఆఫీసుల్లోనూ జరిగిన ఐటీ దాడులు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరగుతోంది.