Begin typing your search above and press return to search.

బాబు జనతా పార్టీ ప్రెసిడెంట్... చిన్నమ్మ మీద పెద్ద మాటే...!

భారతీయ జనతా పార్టీని కాస్తా బాబు జనతా పార్టీగా మార్చేశారు వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్

By:  Tupaki Desk   |   28 July 2023 5:30 PM GMT
బాబు జనతా పార్టీ ప్రెసిడెంట్... చిన్నమ్మ మీద పెద్ద మాటే...!
X

భారతీయ జనతా పార్టీని కాస్తా బాబు జనతా పార్టీగా మార్చేశారు వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్. ఆయన బీజేపీ కొత్త ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి మీద ఒక స్థాయి లో ఫైర్ అయ్యారు. ఆమె బీజేపీ కి ప్రెసిడెంటా లేక బాబు జనతా పార్టీ ప్రెసిడెంటా అని నిలదీశారు. పదవి లోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ మీదనే పని గట్టుకుని దుమ్మెత్తిపోతున్న ఆమె కు వాస్తవాలు తెలియవా అని ప్రశ్నించారు.

ఎంతసేపూ ఏపీ అప్పుల పాలు అయిందని ఆమె అంటున్నారు. అభివృద్ధి కనిపించడంలేదా అని నిలదీశారు. కేంద్రం కూడా అన్ని రికార్డులు చూసి మాత్రమే అప్పులు ఇస్తుందని, ఏపీ చేసిన ప్రతీ అప్పుకూ లెక్కా పద్దూ ఉన్నాయని గుడివాడ అంటున్నారు అభివృద్ధి అంటే పేదల జీవితాలు మారడం కాదా అని ఆమెను ప్రశ్నించారు.

ఏపీ లో ప్రగతి ని చూడకుండా ఆమె విమర్శలు కురిపించడం లో అర్ధమేంటి అని మంత్రి అంటున్నారు. పక్కన ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ లో ఇరవై లక్షల ఇళ్ళ నిర్మాణం జరుగుతోందని అంటే అసలు ఇళ్ల నిర్మాణమే లేదని పురంధేశ్వరి చెప్పడం పట్ల ఆయన ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డేటా తీసుకుంటే అంతా కరెక్ట్ గా ఉంటుందని బాబు దగ్గర డేటా తీసుకుంటే ఇలాగే లెక్కలు ఉంటాయని అన్నారు.

తన మరిది చంద్రబాబు టీడీపీ ని తన తండ్రి ఏర్పాటు చేసిన పార్టీని నిలబెట్టాల ని చిన్నమ్మ తాపత్రయపడుతున్నార ని ఘాటు కామెంట్స్ చేశారు. అలా అయితే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవి ఎందుకు ఎంచక్కా టీడీపీ ప్రెసిడెంట్ అవవచ్చు కదా అని ఆయన సలహా ఇస్తున్నారు. ఎన్టీయార్ కుమార్తెగా ఆమెకు ఆ హక్కు పూర్తిగా ఉందని కూడా గుడివాడ చెబుతున్నారు.

ఎంతసేపూ ఏపీ లోని ప్రభుత్వాన్ని నిందిస్తూ వస్తున్న పురంధేశ్వరి బీజేపీ కి ప్రెసిడెంట్ గా కంటే మరిది కళ్లలో ఆనందం చూసే వదినమ్మ గానే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం ఏపీ ని నిధులు ఇస్తోంది అని పెద్ద మాటలు చెబుతున్న పురంధేశ్వరి నార్త్ స్టేట్స్ తో పోలిస్తే సౌత్ స్టేట్స్ కి ఎన్ని నిధులు కేంద్రం ఇచ్చిందో చర్చకు సిద్ధమేనా అని ప్రశ్నించారు.

సౌత్ స్టేట్స్ పట్ల వివక్ష ను ప్రదర్శిస్తూ వస్తున్న కేంద్రం తీరు పైన తాము డిబేట్ పెట్టగలమని ఆమె రావాల ని సవాల్ చేశారు. అయినా కేంద్రం ఇచ్చే నిధులు ఎవరిని అని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రజలు కట్టే పన్నులు ఎంత కేంద్రం విదిలించే నిధులు ఎంత దీని మీద డేటా దగ్గర పెట్టుకుని చర్చకు సిద్ధమేనా ఆయన పురంధేశ్వరిని ప్రశ్నించారు.

ఏపీ కి ఎన్నో ఇచ్చామని చెబుతున్న పురంధేశ్వరి ప్రత్యేక హోదా తీసుకుని రాగలరా. కలగా మిగిలిపోయిన విశాఖ రైల్వే జోన్ ని తేగలరా. ఎత్తేసిన వాల్తేర్ డివిజన్ ని వెనక్కి తెచ్చి ఇవ్వగలరా అని ప్రశ్నల వర్షం కురిపించారు ఉత్తరాంధ్రా రాయలసీమ జిల్లాల కు వెనకబడిన నిధులు కింద కేంద్రం మూడేళ్ళ పాటు ఇస్తే దాన్ని దారి మళ్ళించి ఖర్చు చేసిన మరిది చంద్రబాబు ని ఎందుకు పురంధేశ్వరి ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు.

బాబు ఏలుబడి లో చిత్తూరు లో పట్టపగలే మేయర్ ని హత్య చేస్తే నాడు అరాచకం అంతా ఏపీ లో ఉందని ఎందుకు పురంధేశ్వరి మాట్లాడలేకపోయారని గుడివాడ ఘాటైన విమర్శలు చేశారు. పురంధేశ్వరి తీరు అంతా బాబు జనతా పార్టీ గానే ఉందని ఆ డేటా చదివితే బీజేపీ ఎదగదని కూడా గుడివాడ జోస్యం చెప్పారు.