Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్.... గుడివాడలో పోటాపోటీగా చంద్రబాబు, కొడాలి!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్వర్గీయ ఎన్టీఆర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   18 Jan 2024 3:49 AM GMT
హాట్ టాపిక్.... గుడివాడలో పోటాపోటీగా చంద్రబాబు, కొడాలి!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్వర్గీయ ఎన్టీఆర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంటే... నేడు ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ప్రధానంగా నిమ్మకూరు ఉన్న నియోజకవర్గం గుడివాడ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వర్ధంతి సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు.

అవును... మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా గుడివాడలో పోటాపోటీ కార్యక్రమాలు రసవత్తరంగా మారనున్నాయి. ఇందులో భాగంగా.. గురువారం టీడీపీ నిర్వహించే "రా.. కదలి రా.." బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని.. ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

ఇలా ఒకే చోట ఇరు వర్గాల వారు సభలు, కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేసుకుంటుండంతో... ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో అప్పుడే వివాదం చెలరేగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఈ రోజు గుడివాడ అంతా గరం గరంగా ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహం తాను ఏర్పాటు చేసిందని, జూనియర్ ఎన్టీఆర్ అందుకు సహకరించారని కొడాలి చెబుతున్నారు. అదే విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పించే అవకాశం ఉందని అంటున్నారు.

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే నివాళి అర్పించనున్నారు. అది పూర్తికాగానే గుడివాడలో "రా.. కదలి రా.." కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ స్థానిక ముఖ్యనాయకులు దగ్గరుండి చూసుకుంటున్నారు.

ఇందులో భాగంగా... ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ తోపాటు వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆల్ మోస్ట్ పూర్తయ్యాయని అంటున్నారు. ఎన్నికల వేళ ఈ బలనిరూపణ అతి ముఖ్యమని భావిస్తున్నారు.

మరోపక్క స్వతహాగా ఎన్టీఆర్‌ కు వీరాభిమాని అయిన కొడాలి నాని.. ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్‌ కు ఘనమైన నివాళి అర్పించడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే అటు టీడీపీ – ఇటు నాని వర్గీయులు మధ్య ఫ్లెక్సీల విషయంలో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు.