Begin typing your search above and press return to search.

మంత్రి గుడివాడకు పల్లాతో ధీటైన పోరు...!

విశాఖ జిల్లాలోని గాజువాక ఈసారి కూడా రసవత్తర పోరుకు తెర తీసేలా ఉంది. 2019లో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీకి దిగారు

By:  Tupaki Desk   |   14 March 2024 11:30 PM GMT
మంత్రి గుడివాడకు పల్లాతో ధీటైన పోరు...!
X

విశాఖ జిల్లాలోని గాజువాక ఈసారి కూడా రసవత్తర పోరుకు తెర తీసేలా ఉంది. 2019లో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీకి దిగారు. ఆయన రాకతో గాజువాక స్టేట్ వైడ్ ఒక్కసారిగా మారుమోగిపోయింది.

గాజువాకలో పవన్ పోటీ ఎంత సెన్సేషన్ అయిందో ఆయన ఓటమి అంతే సంచలనం అయింది. అదే గాజువాక నుంచి 2024 ఎన్నికల్లో పవన్ మరోసారి పోటీ చేస్తారు అని అంతా భావించారు. చివరికి ఆ సీటు టీడీపీకి దక్కింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు.

గాజువాకలో యాదవ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉంది. అదే విధంగా జనసేనతో పొత్తు ఉంది కాబట్టి కాపుల మద్దతు కూడా దక్కే చాన్స్ ఉంది. ఇక కార్మిక వర్గం నేతగా ఆయన తండ్రి పనిచేశారు కాబట్టి స్టీల్ ప్లాంట్ కార్మికుల మద్దతు కూడా పొందే అవకాశం ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే మంత్రి గుడివాడ అమర్నాధ్ కి టికెట్ ఇస్తూ వైసీపీ అధి నాయకత్వం రెండు రోజుల క్రితమే ప్రకటన చేసింది.

గాజువాకలో కాపులు కూడా ప్రధానంగా పెద్ద సంఖ్యలో ఉంటారు. అయితే కాపు ఓటు వైసీపీకి మళ్ళుతుందా లేదా అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయం. కాపులంతా ఏకమొత్తంగా కట్టకట్టుకుని టీడీపీకి వేస్తారు అని అనుకోరు కానీ ఎక్కువ భాగం అటు వైపు పోతే అమర్నాధ్ కి ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు.

గాజువాకలో యాదవులతో పాటు కాపులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాపులు అంతా గుడివాడ వెంట ఉంటే పోరు అపుడు వేరే లెవెల్ లో ఉంటుంది. ఆ సంగతి అలా ఉంటే వైసీపీలో వర్గ పోరు ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి టికెట్ ఇవ్వలేదు అన్నది ఆయన వర్గంలో ఉంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన చందుకు ఇంచార్జిగా ఇచ్చినట్లే ఇచ్చి పక్కన పెట్టారు అన్నది వారిలో ఉంటే యాదవులు వేరే రూట్ తీసుకుంటారు అన్న చర్చ ఉంది.

ఇక మాజీ ఎమ్మెల్యేలు సీనియర్లు లీడర్లు అంతా ఒకే త్రాటి మీదకు వస్తే కనుక అది వైసీపీకి కొంత అడ్వాంటేజ్ అవుతుంది. జగన్ వేవ్ లో సైతం 56 వేల ఓట్లను తెచ్చుకున్న పల్లా శ్రీనివాసరావుకు ఇపుడు జనసేన తోడు అయితే కచ్చితంగా గెలుపు అవకాశాలు ఉండవచ్చు అని ఆ పార్టీ ఊహిస్తోంది. రెండు లక్షల ముప్పై వేల దాకా గాజువాక ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎనభై శాతం ఓటింగ్ పోల్ అయినా లక్షా 85 వేల ఓట్లు పోలవుతాయని ఒక అంచనా.

అందులో నుంచి ఎవరు గెలవాలన్నా తొంబై వేల దాకా ఓట్లు తెచ్చుకోవాలి. అయితే కాంగ్రెస్ ఇతర పార్టీలు ఉంటాయి కాబట్టి ఎలా తీసుకున్న ఎనభై వేల ఓట్లు తెచ్చుకున్న వారు విజేత అవుతారు. గుడివాడ సొంత ప్రాంతం అది. ఇక గత ఎన్నికలో దాదాపుగా ఎనభై వేలకు దగ్గరగా వైసీపీ ఓటింగ్ ఉంది. ఇదిపుడు పెంచుకుంటే కనుక గుడివాడకు గెలుపు అవకాశలు ఉన్నాయని అంటున్నారు. కానీ అంతా సహకరించాలి. మొత్తం మీద చూస్తే గాజువాక టఫ్ ఫైట్ అనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.