Begin typing your search above and press return to search.

భీమిలీలో నువ్వా నేనా ...!?

అయితే అవంతి విమర్శలకు గంటా అయితే అసలు రెస్పాండ్ కావడంలేదు.

By:  Tupaki Desk   |   5 April 2024 4:01 AM GMT
భీమిలీలో నువ్వా నేనా ...!?
X

అయిదేళ్లకు ఒకసారి ఎన్నికల ముందు వచ్చి గెలిచాక జనం ముఖం చూడని నేత అంటూ గంటా శ్రీనివాసరావు మీద వైసీపీ భీమిలీ ఎమ్మెల్యే అభ్యర్ధి అవంతి శ్రీనివాసరావు నిప్పులు చెరుగుతున్నారు. ఆయన అయిదేళ్ళు మంత్రిగా పనిచేశారు. ఏమైనా మేలు జనాలకు చేశారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతీ ఎన్నికకూ నియోజకవర్గాన్ని మారుస్తూ తిరిగే గంటాను జనం నమ్మరని అవంతి ఘాటు విమర్శలు చేశారు.

అయితే అవంతి విమర్శలకు గంటా అయితే అసలు రెస్పాండ్ కావడంలేదు. చాప కింద నీరులా తన పని తాను చేసుకుని పోతున్నారు. వైసీపీ నుంచి కొంతమంది కీలక నేతలను లాగేస్తున్నారు. గంటా భీమిలీలో ఇంకా కాలు మోపలేదు. కానీ వైసీపీ నేతలనే విశాఖలో ఉన్న తన ఇంటికి రప్పించి మరీ కండువాలు కప్పుతున్నారు.

భీమిలీలో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం 2014లో గంటాకు 37 వేల పై చిలుకు మెజారిటీ ఇక్కడ వచ్చింది. దాంతో గంటా ధీమాగా ఉన్నారు. కానీ పదేళ్ల కాలం గడచింది. నాడు ఉన్న వారు నేడు మారిపోయారు పైగా పార్టీల బలాబలాలలో తేడాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

అవంతి శ్రీనివాసరావు కూడా ఏమీ తక్కువ వారు కాదు. ఆయన కూడా ఓటమి ఎరగని నేతగానే ఉన్నారు. 2009లో భీమిలీ నుంచే ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యారు. 2019లో తిరిగి భీమిలీలో ఎమ్మెల్యే అయి మంత్రి కూడా అయ్యారు. అంటే గంటాకు తగిన వారే. ఇద్దరికీ ఓటమి ఎరగని చరిత్రగానే ఉంది.

అటువంటిది గంటా వర్సెస్ అవంతి అంటే ఎవరు ఓడతారు ఎవరు గెలుస్తారు అంటే చెప్పలేని పరిస్థితి. టీడీపీలోనే గంటాకు అసంతృప్తి సెగలు ఉన్నాయి. మాజీ ఎంపీపీ భీమిలీ టీడీపీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు అయితే టికెట్ దక్కలేదు కారణం చెప్పమని అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఆయన సహకారం గంటాకు ఎంతవరకు ఉంటుంది అన్నది ప్రశ్నార్ధకం అంటున్నారు. మరో వైపు చూస్తే జనసేన నుంచి టికెట్ ఆశించిన పంచకర్ల సందీప్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. జనసేన నేతలు క్యాడర్ అయితే తాము సహాయ నిరాకరణతోనే తన యాక్షన్ ఏంటో చూపిస్తామని అంటున్నారు.

మరి గంటా చూస్తే చతురుడు. కానీ ఈ రెండు వర్గాలను కీలక నేతలను కలుపుకుని పోకపోతే మాత్రం ఆయనకు ఇబ్బంది అంటున్నారు. ఇక అవంతి విషయానికి వస్తే ఆయనకు బొత్స సత్యనారాయణ రూపంలో అండ దొరికింది. బొత్స సతీమణి విశాఖ ఎంపీగా చేస్తున్నారు. దాంతో బొత్స రాజకీయ వ్యూహాలు ఎత్తులు వేరే లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. వీటికి తోడు భీమిలీ ప్రాంతాన్నే రాజధానిగా వైసీపీ ప్రకటిస్తోంది. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే భీమిలీయే కాపిటల్ సిటీ అని అందరికీ తెలుసు.

దాంతోనే గంటా అన్నీ చూసుకుని భీమిలీ నుంచి పోటీకి దిగుతున్నారు అని అంటున్నారు. భీమిలీలో అవంతి వర్సెస్ గంటా అంటే టైట్ ఫైట్ నడిచేలాగానే ఉంది. ఎవరు విజేతలు అన్నది చెప్పడం కష్టమే. జనాలు ఎవరి పక్షం ఉంటారో చూడాల్సి ఉంది.