Begin typing your search above and press return to search.

మాధురి రెచ్చగొట్టే పోస్టులు.. మహిళా నేతల నుంచి ఒత్తిళ్లు.. అందుకే దువ్వాడపై సస్పెన్షన్..?

భార్య, బిడ్డలతో తగువు పెట్టుకుని ప్రేయసి మాధురితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఎమ్మెల్సీ దువ్వాడపై చర్యలు తీసుకోడానికి ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   24 April 2025 3:30 PM
మాధురి రెచ్చగొట్టే పోస్టులు.. మహిళా నేతల నుంచి ఒత్తిళ్లు.. అందుకే దువ్వాడపై సస్పెన్షన్..?
X

ఎమ్మెల్సీ దువ్వాడ సస్పెన్షన్ పై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. వ్యక్తిగత కారణాలతో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఎమ్మెల్సీ చెబుతుండగా, పార్టీ క్రమశిక్షణ అతిక్రమించినందునే వేటు వేసినట్లు అధిష్టానం ప్రకటించింది. ఇదే సమయంలో మంత్రి లోకేశ్ ను పొగడటం వల్లే దువ్వాడను సస్పెండ్ చేశారని టీడీపీ, జనసేన సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. మరోవైపు దువ్వాడ సస్పెన్షన్ ఎప్పుడో చేయాల్సిందని వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆకస్మాత్తుగా దువ్వాడను ఎందుకు సస్పెండ్ చేశారనేది తీవ్ర చర్చకు దారి తీస్తోంది. వాస్తవానికి దువ్వాడపై ఎప్పుడో సస్పెన్షన్ విధించాల్సివున్నా, ఆయన వైఖరి మారుతుందేమోనన్న ఆలోచనతో ఇన్నాళ్లు వేచిచూసిందని అంటున్నారు. రోజురోజుకు ఆయన పరిస్థితిపై విమర్శలు ఎక్కువ అవుతుండటంతో చివరికి వేటు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

భార్య, బిడ్డలతో తగువు పెట్టుకుని ప్రేయసి మాధురితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఎమ్మెల్సీ దువ్వాడపై చర్యలు తీసుకోడానికి ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. ఫ్యామిలీ వార్ రచ్చకెక్కిన వెంటనే దువ్వాడను టెక్కలి ఇన్ చార్జిగా తప్పించిన పార్టీ అప్పట్లోనే వైఖరి మార్చుకోవాలని సంకేతాలు పంపిందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని గమనించని దువ్వాడ.. పార్టీ ఇన్చార్జిగా తప్పించినా, ఎన్నికల సమయంలో మళ్లీ తానే అభ్యర్థిని అవుతానని ధీమాతో విచ్చలవిడిగా ప్రవర్తించారని చెబుతున్నారు. అదే సమయంలో దువ్వాడ ప్రేయసి దివ్వెల మాధురి పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని టెక్కలి ఇన్ చార్జి పేడాడ తిలక్ కు తలనొప్పులు తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో దివ్వెల మాధురి తన సోషల్ మీడియా అకౌంటులో పేడాడను ఉద్దేశిస్తూ పుష్ప డైలాగ్ మాదిరిగా చేసిన పోస్టింగు వైరల్ అయింది.

‘‘దమ్ముంటే తెచ్చుకోరా టికెట్.. తెచ్చుకుంటే వదిలేస్తా పోస్టింగు’’ అంటూ పెట్టిన పోస్టింగు వైసీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. తన నాయకత్వాన్ని ప్రశ్నించేలా దువ్వాడ ప్రోత్సాహంతో మాధురి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై అధిష్టానానికి ఆయన ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని కొందరు మాజీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా నాయకులు కూడా దువ్వాడపై చర్యలు తీసుకోవాలని పార్టీని కోరినట్లు చెబుతున్నారు.

కొద్ది రోజులుగా దువ్వాడ కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిపోయారంటున్నారు. అతని ప్రియురాలు మాదురితో కలిసి శృతి మించి తిరుగుతుండటంతో పార్టీలో మహిళా నేతలు ఇరుకున పడుతున్నారని చెబుతున్నారు. అడల్టరీ పేరుతో దువ్వాడ ప్రేమ జంట సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం తో తాము ఇబ్బందులు పడుతున్నామని మాజీ మహిళా ఎమ్మెల్యేలు స్వయంగా అధినేత జగన్ కి ఫిర్యాదు చేశారని అంటున్నారు. రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం జరుగుతున్నా స్పందించలేకపోతున్నామని .. ఎవరిని ప్రశ్నించినా, ముందు మీ పార్టీ నేతను సరిదిద్దుకోండంటూ తమకి కౌంటర్లు వస్తున్నాయని మహిళా నేతలు తలబాదుకున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా దువ్వాడను ఎంటరటైన్ చేస్తే పార్టీ పరువు మరింత బజారున పడుతుందని డిసైడ్ అయిన మాజీ సీఎం జగన్ ఎమ్మెల్సీ దువ్వాడపై వేటు వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సమాచారం ముందుగా చెప్పకపోవడంతో దువ్వాడ సస్పెన్షన్ ను సైతం రాజకీయ ప్రత్యర్థులు వేరేగా ప్రచారం చేస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.