Begin typing your search above and press return to search.

వదల బొమ్మాళీ వదల.. చంద్రబాబుపై మరో కేసు!

ఇప్పుడు ఎన్నికల ముంగిట తాజాగా చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసును నమోదు చేసింది. రాజధాని అమరావతిలో ఎసైన్డ్‌ భూములను కొనుగోలు చేశారనే ఆరోపణలపై తాజా కేసును నమోదు చేశారు.

By:  Tupaki Desk   |   12 March 2024 7:53 AM GMT
వదల బొమ్మాళీ వదల.. చంద్రబాబుపై మరో కేసు!
X

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇప్పటికే ఫైబర్‌ నెట్‌ కేసు, రాజధాని భూముల కేసు, స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసు తదితర కేసులను ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. స్కిల్‌ డెవలప్మెంట్‌ కు సంబంధించి నిధులు గోల్‌ మాల్‌ అయ్యాయనే అభియోగాల నేపథ్యంలో 50 రోజులకుపైగా చంద్రబాబును జైలులో నిర్బంధించారు. ఈ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్‌ పై ఉన్నారు.

ఇప్పుడు ఎన్నికల ముంగిట తాజాగా చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసును నమోదు చేసింది. రాజధాని అమరావతిలో ఎసైన్డ్‌ భూములను కొనుగోలు చేశారనే ఆరోపణలపై తాజా కేసును నమోదు చేశారు. అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలుకు సంబంధించి 2020లోనే సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా చంద్రబాబును నిందితుడిగా చేర్చారు.

చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అభియోగపత్రం దాఖలు చేసింది. దానిని పరిశీలించాలని ఏసీబీ కోర్టు ఏవోను ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా ఎసైన్డ్‌ భూములకు ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని.. ఎసైనీదారులను భయాందోళనలకు గురిచేసి అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, ఇతర మంత్రులు, వారి బినామీలు.. తక్కువ ధరకు భూములు కొన్నట్లు అభియోగపత్రంలో సీఐడీ ఆరోపించింది. కొనుగోలు చేసిన ఎసైన్డ్‌ భూములకు భూసమీకరణ ప్రయోజనాలు పొందేందుకు అధికారులను ఒత్తిడి చేసి, నిబంధనలకు విరుద్ధంగా జీవో 41 జారీ చేయించారని తెలిపింది.

భూముల కొనుగోలుకు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, కేపీవీ అంజనీకుమార్, గుమ్మడి సురేశ్, కొల్లి శివరామ్, మంత్రుల కుటుంబసభ్యులు బినామీలుగా వ్యవహరించార ని సీఐడీ చార్జిషీట్‌ లో తెలిపింది. మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ను ఒత్తిడి చేసి భూములను రిజిస్టర్‌ చేయించారని ఆరోపించింది. నారాయణ, ఆయన కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, కంపెనీల నుంచి రామకృష్ణ హౌజింగ్‌ సొసైటీ, ఇతర రియల్‌ ఎస్టేట్‌ సంస్థల మధ్యవర్తులకు రూ.16.5 కోట్ల నిధులు వెళ్లాయని సీఐడీ అభియోగాలు మోపింది. ఆ సొమ్మును ఎసైన్డ్‌ రైతులకు చెల్లించి నారాయణ బినామీలు అక్రమంగా విక్రయ దస్తావేజులు రాయించుకున్నారని పేర్కొంది.

ఈ మేరకు రాజధాని అమరావతిలో ఎసైన్డ్‌ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ యల్లమాటి ప్రసాద్‌ కుమార్‌ అనే వ్యక్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 2020 ఫిబ్రవరి 27న పలువురిపై సీఐడీ కేసు నమోదు పెట్టింది.

అలాగే ఇదే వ్యవహారంపై నల్లూరు రవికిరణ్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2020 మార్చి 3న సీఐడీ మరో కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా పలువురిని నిందితులుగా చేర్చింది. ఈ క్రమంలో 2022లో మాజీమంత్రి నారాయణ కూడా నిందితుల జాబితాలోకి ఎక్కారు. ఈ నేపథ్యంలో సీఐడీ తనపైన నమోదు చేసిన కేసుల్ని కొట్టేయాలంటూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో నిందితులకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నిబంధనల్ని పాటించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ సెక్షన్‌ కింద నిందితులకు నోటీసులు ఇచ్చి విచారించాలని సూచించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ హైకోర్టులో పెండింగ్‌ లో ఉంది.

ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ చంద్రబాబును నిందితుడిగా అభియోగపత్రం దాఖలు చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది. క్రై ం నం. 14/2020లో చంద్రబాబును 40వ నిందితుడిగా సీఐడీ తెలిపింది. మరో 22 మందిని నిందితులుగా చేర్చాలని ఏసీబీ కోర్టులో సీఐడీ డీఎస్పీ మెమో దాఖలు చేశారు. చంద్రబాబుతోపాటు, నాటి మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ, తుళ్లూరు మండలం అప్పటి తహశీల్దార్‌ సుధీర్‌ బాబు, రామకృష్ణ హౌజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీ కేపీవీ అంజనీకుమార్‌ ను ప్రధాన నిందితులుగా చేర్చింది.