Begin typing your search above and press return to search.

ఇక 1995 నాటి బాబు....తట్టుకోవడం కష్టమే ?

ఏపీకి నాలుగవ సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గత ఏడాది కాలంగా తరచూ ఒక మాట చెబుతూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 May 2025 1:30 AM
ఇక 1995 నాటి బాబు....తట్టుకోవడం కష్టమే ?
X

ఏపీకి నాలుగవ సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గత ఏడాది కాలంగా తరచూ ఒక మాట చెబుతూ వస్తున్నారు. అదేంటి అంటే 1995 నాటి చంద్రబాబుని చూడబోతున్నారు అని. అది ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇపుడు అదే జరగబోతోంది.

బాబు ఒకసారి అన్నాక అది జరగక మానదు. పైగా ఆయన పట్టుదల కల మనిషి. అంతే కాదు ఆయన ప్రజలతో మమేకం కావాలని ఎపుడూ అనుకుంటారు. ఇక ఆయన పని రాక్షసుడుగా పేరు గడించారు. తాను నిద్రోబోనూ మిమ్మల్ని నిద్రపోనీయను అంటూ బాగు తనదైన స్లోగన్ తో ఉమ్మడి ఏపీలో సరికొత్తగా పాలన చేశారు. కొత్త పుంతలు తొక్కించారు.

అటువంటి బాబు ఇపుడు మళ్ళీ 1995 నాటి చంద్రన్నను తీసుకుని రాబోతున్నారు మరి అపుడు బాబు వయసు 45 ఏళ్ళు కదా ఇపుడు 75 ఏళ్ళు కదా ఎలా సాధయమని ఎవరూ సందేహం పడాల్సినది లేదు. బాబుకు ఏజ్ అన్నది జస్ట్ ఒక టెక్నికల్ రీజన్ మాత్రమే.

అందువల్ల బాబులో అదే దూకుడు అదే చురుకుదనం, అదే పట్టుదల ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ 1995 నాటి బాబు ఏమిటి ఇపుడు బాబు అలా ఎందుకు మారుతున్నారు అంటే పాలనలో కచ్చితత్వం కోసమే అని అంటున్నారు. 1995లో చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యారు. ఆ సమయంలో పాలనలో పట్టు కోసం ఆయన ఆకస్మికంగా అన్ని జిల్లాలూ తిరిగేవారు మొత్తం ఉమ్మడిగా ఉన్న 23 జిల్లాలలో బాబు పర్యటించేవారు.

అయితే ఏ రోజు బాబు ఏ జిల్లాకు వస్తున్నారు అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. అది సీక్రెట్ గా ఉంచేవారు. ఇప్పటిలా అపుడు సెల్ ఫోన్లూ ఏవీ ఉండేవు కావు. అన్నీ ల్యాండ్ లైన్స్ మాత్రమే దాంతో బాబు ఆకస్మిక పర్యటనలు ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే శ్రీకాకుళం జిల్లా దాకా కొనసాగేవి.

ఎపుడు ఎక్కడకు బాబు వస్తున్నారో ఎవరికీ తెలియకపోవడంతో పాలన ఎలా సాగుతోందో క్షేత్ర స్థాయిలో ఎవరేమిటి అన్నది బాబుకు పూర్తిగా తెలిసి వచ్చేది. దాంతో ఆయన సీరియస్ గానే రియాక్ట్ అయ్యేవారు. యాక్షన్ కూడా వెంటనే తీసుకునేవారు.

ఇక ఇపుడు మళ్ళీ ఆకస్మిక పర్యటనలు అంటున్నారు బాబు. అంతే కాదు బాబు పాలనలో మార్పు కోసమే ఈ యాత్రలు చేపడుతున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో నాణ్యమైన పాలన కోసం మరింత సమర్ధవంతమైన పాలన కోసమే బాబు ఈ ఆకస్మిక పర్యటనలు పెట్టుకుంటున్నారు అని అంటున్నారు.

ఇక జూన్ 12తో బాబు పాలనకు ఏడాది పూర్తి కావస్తోంది. దాంతో ఆ తరువాత ఏ క్షణం నుంచైనా ఆకస్మిక తనిఖీలు మొదలెడతామని బాబు ప్రకటించేశారు. అలా జూన్ 12 తరువాత ఎప్పుడైనా రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ ప్రభుత్వ సేవలపై ఆయన ఇక మీదట సచివాలయ్హంతో పాటు జిల్లాలలో ఆకస్మిక పర్యటనలలోనే చేస్తారు అని అంటున్నారు.

ఇప్పటికే ప్రతివారం నాలుగు శాఖల పరిధిలో పథకాలు, సేవలపై ప్రజలనుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను సమీక్షిస్తున్న చంద్రబాబు వాటిలో కూడా పాలనాపరంగా మరింత మెరుగుదనం ఉండాలని అధికారులను ఆదేశిస్తున్నారు. అంతే కాదు రేషన్, దీపం, ఎపిఎస్ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను ఆయన ఎప్పటికపుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శాఖల పరిధిలో అమలు అవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఐవిఆర్ఎస్, క్యూ ఆర్ కోడ్ వంటి విధానాల ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.

ఇక అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రజా సేవల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి కనిపించాలని ముఖ్యమంత్రి గట్టిగా కోరుతున్నారు. అయితే బాబు ఇస్తున్న ఆదేశాలు చేస్తున్న సూచనల వల్ల కొన్ని శాఖలలో మార్పు వచ్చింది, కానీ ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందని అంటున్నారు. దాంతో బాబు ఇక జనంలోకి వెళ్ళాల్సిందే అని నిర్ణయించుకుంటున్నారు. మరి బాబు కనుక జనంలోకి వచ్చి ఆకస్మిక తనిఖీలు చేపడితే కనుక తట్టుకోవడం కష్టమే అని అంటున్నారు. అన్ని శాఖలలో పనితీరు మెరుగుపడాల్సిందే అని అంటున్నారు. లేకపోతే ఇబ్బందులు తప్పవని కూడా అంటున్నారు.