బటన్ నొక్కను...చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే రాజకీయ అనుభవశాలి. ఆయన మాట్లాడే ప్రతి మాట వెనక ఎంతో అర్థం ఉంటుంది.
By: Tupaki Desk | 26 April 2025 3:05 PMటీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే రాజకీయ అనుభవశాలి. ఆయన మాట్లాడే ప్రతి మాట వెనక ఎంతో అర్థం ఉంటుంది. ఆయన ఆలోచనలు ఆచరణలూ కూడా చాలా వ్యూహాత్మకంగా ఉంటాయి. బటన్ నొక్కడం అన్నది మూలనున్న ముసలమ్మ కూడా చేస్తుంది. ఈ జగన్ చేసేది ఏమిటి గొప్పా అని విపక్షంలో ఉన్నపుడు తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు ఇపుడు తాను అధికారంలోకి వచ్చాక బటన్ నొక్కడంలేదు.
బటన్ నొక్కడం మీ వల్ల కావట్లేదా బాబూ అని వైసీపీ నేతలూ తరచూ ప్రశ్నిస్తూంటారు. వారి దృష్టిలో బటన్ నొక్కడం అంటే జగన్ వల్లనే సాధ్యపడుతుందని చెప్పడమే అంటున్నారు. అయితే బాబు సంక్షేమం ఎలా ఉంటుందో ఆయన మార్క్ ఏమిటో ఆయనే చెప్పుకున్నారు. నేను ఎక్కడో మూలన కూర్చుని బటన్ నొక్కే సీఎం ని కాను అని శ్రీకాకుళం పర్యటనలో బాబు అన్నారు. అందుకే నేను బటన్ నొక్కనని ఆయన స్పష్టం చేశారు.
గత పాలకుల మాదిరిగా బటన్ నొక్కి ప్రచారం చేసుకోవడం నాకూ వచ్చు కానీ చేయాల్సింది అది కాదని బాబు చెప్పుకొచ్చారు. ప్రజలను నేరుగా కలిస్తేనే వారి సమస్యలు తెలుస్తాయని అవి పరిష్కారానికి నోచుకుంటాయని చంద్రబాబు చెప్పారు. అదే తన విధానం అన్నారు. అంతే కాదు ప్రజలందరికీ సంక్షేమం అందించడమే తన ధ్యేయమని చెప్పారు.
మత్స్యకారుల కుటుంబాలను న్యాయం చేసిన ఘనత తమదే అన్నారు. 2014లో తొలిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు భృతిని ప్రవేశ పెట్టిందని చెప్పారు. ఇక 2014-2019 మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788 కోట్లు ఖర్చు పెట్టామని ఆయన అన్నారు.
అంతేకాకుండా వలలు, పడవలు, ఐస్ బాక్సులు అదనంగా ఇచ్చిందని చెప్పారు. మత్స్యకారుల పిల్లలకు ప్రత్యేకంగా ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాము.. గత పాలకులు ఫిష్ ఆంధ్ర పేరుతో రూ. 300 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల కుటుంబాలకు బృహ్తి కింద పది వేలు ఇస్తే దానికి ఇరవై వేలకు పెంచామని బాబు చెప్పారు. ఇలా ఒక్కసారిగా రెట్టింపు చేసిన క్రెడిట్ కూటమి ప్రభుత్వానిది అని ఆయన అన్నారు.
మరో వైపు చూస్తే కనుక బటన్ నొక్కుతూ నాలుగు గోడల మధ్యన జగన్ గడిపారు అని తాను మాత్రం ప్రజల కోసం పనిచేస్తూ వారి పధకాలను వారి వద్దకే ఇస్తూ ప్రజా పాలన సాగిస్తున్నాను అని బాబు గట్టిగా చెబుతున్నారు అని అంటున్నారు. బాబు ఏ పధకం అయినా ప్రజల మధ్యనే ప్రారంభిస్తున్నారు. అంతే కాదు వారితో మమేకం అవుతున్నారు.
వారి అభిప్రాయలను తెలుసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా వారి మెప్పుని పొందుతునారు అని అంటున్నారు. నిజం చెప్పాలంటే బాబు చేసిందే కరెక్ట్ అని అంతా అంటున్నారు. ప్రజల వద్దకు వచ్చి వారికి పధకాలను అందించడం ద్వారా కూటమి ప్రభుత్వం గ్రాఫ్ ని కూడా బాబు పెంచుతున్నారు అని అంటున్నారు.
ఈ విధంగా చేయలేకపోవడం వల్లనే వైసీపీ ప్రభుత్వం ప్రజలకు దూరం అయింది అని అంటున్నారు ఏది ఏమైనా అనుభవం ప్లస్ వ్యూహాలు దటీజ్ బాబు అని అంటున్నారు. బాబుకు బటన్ నొక్కడం వచ్చు. అంతకంటే ఎక్కువగా ప్రజలతో కనెక్ట్ అవడం బాగా వచ్చు అని అంటున్నారు. మరి వైసీపీ ఈ రాజకీయ పాఠాలను సూత్రాలను తెలుసుకుంటుందా అన్నదే చూడాల్సి ఉంది.