చంద్రబాబు, జగన్ మధ్య తేడాలివే.. చాట్ జీపీటీ విశ్లేషణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మధ్య తేడా ఏంటి..? ఎవరి విధానాలు బాగుంటాయి? ప్రజల్లో ఏయే వర్గాలు ఎవరిని అభిమానిస్తాయి..? ఇలాంటి ప్రశ్నలకు ఆయా పార్టీల కార్యకర్తలు తమ నచ్చినట్లు విశ్లేషించి చెప్పుకోవచ్చు.
By: Tupaki Desk | 6 Jun 2025 3:30 PMఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మధ్య తేడా ఏంటి..? ఎవరి విధానాలు బాగుంటాయి? ప్రజల్లో ఏయే వర్గాలు ఎవరిని అభిమానిస్తాయి..? ఇలాంటి ప్రశ్నలకు ఆయా పార్టీల కార్యకర్తలు తమ నచ్చినట్లు విశ్లేషించి చెప్పుకోవచ్చు. కానీ, ఏఐ ఆధారిత గూగుల్ చాట్ జీపీటీని ఇదే ప్రశ్న అడిగితే.. ఏం చెప్పిందో తెలుసా? నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు, ఐదేళ్లు సీఎంగా పనిచేసిన జగన్ గురించి ఏపీలో అందరికీ స్పష్టమైన అవగాహన ఉంది. ఇద్దరివి రెండు వేర్వేరు దారులైనా.. ఇద్దరు అధికారం కోసమే నిరంతరం పరితపిస్తుంటారు. అయితే అధికార పీటానికి చేరుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని పాటిస్తారు. ఇదే విషయాన్ని చాట్ జీపీటీ తనదైన విశ్లేషణ అందించింది.
43 ఏళ్ల టీడీపీకి 30 ఏళ్లు సీఎం చంద్రబాబు అధ్యక్షత వహిస్తున్నారు. తొలిసారి 1995లో సీఎం అయిన చంద్రబాబు ఆ తర్వాత 1999, 2014, 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించి ముఖ్యమంత్రిగా రాష్ట్రంపై తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక 2011లో సొంత పార్టీ పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్ దాదాపు 8 ఏళ్లు పోరాడి 2019లో అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల పాలనలో ఆయన అనుసరించిన విధానాలతో ఓటమిని మూటగట్టుకున్నారు. అయితే గూగుల్ చాట్ జీపీటీ మాత్రం చంద్రబాబు, జగన్ మధ్య తేడాలను చాలా స్పష్టంగా విశ్లేషించి ఆకట్టుకునే సమాచారం అందజేసింది.
చంద్రబాబు ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా రాజకీయాల్లోకి వచ్చినా, టీడీపీ అధ్యక్ష పదవిని మాత్రం మామ ఎన్టీఆర్ వారసుడిగానే అందుకున్నారని చెప్పింది చాట్ జీపీటీ. అదేవిధంగా మాజీ సీఎం జగన్ వారసత్వ రాజకీయాల నుంచి వైసీపీని స్థాపించారని.. ఇద్దరు పార్టీ అధ్యక్షులుగా కొనసాగడానికి వారసత్వ రాజకీయాలే కారణమని వెల్లడించింది. ఇదే సమయంలో సంక్షేమంపై జగన్ ఎక్కువగా శ్రద్ధ పెడితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమం కన్నా అభివృద్ధి, టెక్నాలజీ, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తారని వివరించింది.
ప్రజలతో అనుబంధం విషయంలో జగన్ గ్రామ స్థాయిలో వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు దగ్గరైతే.. చంద్రబాబు ఎక్కువగా మీడియా, పర్యాటక రంగాలకు ప్రోత్సాహం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించారని చెప్పింది. ఆర్థిక విధానాల అమలులో జగన్ డీబీటీ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా డబ్బులు పంపిణీ చేయడానికి ప్రాధాన్యమిస్తే, చంద్రబాబు పెట్టుబడులు, పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి ప్రజలకు ఉపాధి కల్పనపై ఫోకస్ చేస్తారని స్పష్టం చేసింది. జగన్ బలహీనత పెట్టుబడిదారులను నిర్లక్ష్యం చేయడం అయితే.. చంద్రబాబుకు సంక్షేమంపై దృష్టి లేకపోవడమని విశ్లేషించింది. చంద్రబాబు ఎక్కువగా పీఆర్ ఆధారిత పాలన చేస్తారని ప్రశంసించింది.
ఇక పబ్లిక్ స్పీకింగ్ విషయంలో జగన్ ఎక్కువగా భావోద్వేపూరిత ప్రసంగాలిస్తారని, చంద్రబాబు గణంకాలు, విజన్ తో మాట్లాడతారని తెలిపింది. జగన్ పై పేదలు, మధ్య తరగతి, మహిళలు, రైతుల్లో సానుకూలత ఉంటే, చంద్రబాబును ఎక్కువగా చదువుకున్నవారు, నగర వాసులు, విద్యావంతులు, వ్యాపార వర్గం అభిమానిస్తుందని వెల్లడించింది. ఇలా ఇరువురి నాయకుల మధ్య పోలికలు, వైరుధ్యాలు ఉన్నట్లు చాట్ జీపీటీ వెల్లడించిన విశ్లేషణ ఆకట్టుకుంటోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సమయంలో ఎక్కువ మంది నెటిజన్లు ఈ విషయంపై దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఏం జరిగిందో? తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్న వారికి సంక్షేమం బదులుగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలపై సమాధానాలుు వస్తున్నాయని చెబుతున్నారు.