Begin typing your search above and press return to search.

దేశవ్యాప్తంగా పతాకశీర్షికల్లో అమరావతి.. చంద్రబాబు ఊహించిందే జరిగింది!

ఏపీ రాజధాని పునఃనిర్మాణ పనులు ప్రారంభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఊహించిందే జరిగింది. రాజధాని అమరావతికి దేశవ్యాప్తంగా ప్రచారం తీసుకురావాలని భావించిన చంద్రబాబు స్కెచ్ 100 శాతం నిజమైంది.

By:  Tupaki Desk   |   3 May 2025 4:05 PM
Chandrababu Strategy Pays Off: National Media Coverage Boosts Amaravati 2.0
X

ఏపీ రాజధాని పునఃనిర్మాణ పనులు ప్రారంభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఊహించిందే జరిగింది. రాజధాని అమరావతికి దేశవ్యాప్తంగా ప్రచారం తీసుకురావాలని భావించిన చంద్రబాబు స్కెచ్ 100 శాతం నిజమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు తిరిగి ప్రారంభించడం ఎందుకన్న విమర్శలకు శనివారం ఉదయం జాతీయ మీడియా ఇచ్చిన కవరేజీతో సమాధానం లభించింది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు సక్సెస్ అయ్యారంటున్నారు. ఆయన మీడియా మేనేజ్మెంట్ కు ఇది చక్కని ఉదాహకరణగా చెబుతున్నారు. అమరావతికి ఓ బ్రాండ్ తీసుకువచ్చే విషయంలో తొలి అడుగులోనే ముఖ్యమంత్రి చంద్రబాబు విజయం సాధించారని అంటున్నారు.

వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటే అమరావతి పనులకు ఆయనే శంకుస్థాపన చేసేయొచ్చు. ఇప్పటికే ఓ సారి ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినందున మళ్లీ ఆయనను తీసుకురావాల్సిన అవరసం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఏపీసీసీ చీఫ్ షర్మిల సైతం ఇవే విమర్శలు చేశారు. కానీ, ప్రభుత్వం పట్టుబట్టి ప్రధాని మోదీని అమరావతి 2.0 పనుల ప్రారంభానికి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటికి రెండు సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రస్తుతం చంద్రబాబుపైనే కేంద్రం ఆధారపడి పనిచేస్తోందనే అభిప్రాయం ఉంది. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు అలా భావించలేదు. ప్రధాని మోదీని రాజధానికి తీసుకువచ్చి, ఇక్కడ జరుగుతున్న పనులు, ఏర్పడుతున్న ప్రాజెక్టులపై జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని భావించారు. ముఖ్యమంత్రి హోదాలో తాను ప్రారంభిస్తే జాతీయ మీడియాలో అంత కవరేజీ వచ్చే అవకాశం ఉండదని ఊహించారు. ప్రధాని వస్తే ఆ లెవలే వేరుగా భావించారు. ఆయన అనుకున్నట్లే అమరావతి పునఃప్రారంభంపై జాతీయ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ప్రధాని మోదీ కార్యక్రమంతో పాటు అమరావతి విశిష్టతలను తెలియజేస్తూ ప్రత్యేక కథనాలు రాసింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇలాంటి ప్రచారమే కావాలని కోరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మీడియా కవర్ చేయడం వల్ల రాజధానికి పెద్దగా ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి భావించారని అంటున్నారు. జాతీయ మీడియాలో అమరావతిపై కథనాలు వస్తే, జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అమరావతిలో అందుబాటులో ఉన్న భూమి, ప్రభుత్వ రాయితీలు, కొత్తగా వస్తున్న సంస్థలుపై ప్రచారం దక్కితే కొత్త పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే జాతీయ మీడియా అమరావతికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయన సక్సెస్ అయ్యారంటున్నారు.

ఇదే సమయంలో ప్రధాని మోదీయే సాక్ష్యత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పతనాన్ని చెప్పడం అదనపు అడ్వాంటేజుగా చెబుతున్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలను అనుసరించేవాడినని ప్రధాని చెప్పడం చంద్రబాబుకు పెద్ద ప్రశంసగా భావిస్తున్నారు. టెక్నాలజీ వాడటంలో ప్రధాని మోదీ ముందుంటారని చంద్రబాబు అంటే.. ఆ విషయంలో చంద్రబాబు ముందుచూపును ప్రస్తావిస్తూ అలనాటి విషయాలను గుర్తు చేశారు ప్రధాని మోదీ. దీని ద్వారా చంద్రబాబు నాయకత్వానికి మోదీ కూడా ఫిదా అయ్యారంటూ టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటోంది.