Begin typing your search above and press return to search.

చంద్రబాబు సహా 20 మందిపై హత్యాయత్నం కేసు!

ఇందులో ఏ1 గా టీడీపీ అధినేత చంద్రబాబును చేరుస్తూ పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్. నమోదు చేశారు.

By:  Tupaki Desk   |   9 Aug 2023 6:26 AM GMT
చంద్రబాబు సహా 20 మందిపై హత్యాయత్నం కేసు!
X

పుంగనూరు, అంగళ్లు హింసాత్మక ఘటన కేసులు మరో మలుపు తిరగాయి. ఈ ఘటనలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఈ నెల 4న చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పర్యటన సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు వద్ద, చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన అల్లర్లపై పోలీసులుకు ఫిర్యాదులు అందాయి.

ఈ ఫిర్యాదులతో కేసులు నమోదు చేసిన పోలీసులు చంద్రబాబుతోపాటు టీడీపీ లీడర్లను నిందితుల జాబితాలో చేర్చారు. ఇందులో ఏ1 గా టీడీపీ అధినేత చంద్రబాబును చేరుస్తూ పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్. నమోదు చేశారు. ఆయనతోపాటు ఏ2గా దేవినేని ఉమామహేశ్వరరావు, ఏ3గా అమర్నాథ్ రెడ్డిని చేర్చారు. అన్నమయ్య జిల్లా ముదివీడు పీఎస్‍ లో ఈ మేరకు కేసు నమోదు చేశారు.

వారితో పాటు నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి, దమ్మాలపాటి రమేశ్‌, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు పెట్టారు. ఇతరులు అంటూ మరికొందరు టీడీపీ నేతలపైనా కేసు నమోదు చేశారని తెలుస్తోంది. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈనెల 4న మారణాయుధాలు, ఐరన్‌ రాడ్లు, ఇటుకలు, కర్రలు వంటి వాటితో ప్రయాణిస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఉమాపతిరెడ్డి. ఈ మేరకు ఎఫ్‌.ఐ.ఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం, 120బీ సెక్షన్ కింద నేరపూరిత కుట్ర చేసినట్టు అందులో పేర్కొన్నారు.

ఇదే సమయంలో అంగళ్లు, పుంగనూరు అల్లర్ల కేసులో మొత్తం 245 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. వారిలో సుమారు 74 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌ కు తరలించారని అంటున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మొత్తం ఇప్పటి వరకూ ఏడు చార్జ్‌ షీట్‌ లు నమోదు చేయగా.. ఇందులో ప్రధాన నిందితుడిగా చల్లాబాబు అలియాస్ రామచంద్రారెడ్డిని చేర్చారు.