Begin typing your search above and press return to search.

బీజేపీకి వలసనేతలే దిక్కా ?

రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఇలా తయారైంది. విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 March 2024 2:30 PM GMT
బీజేపీకి వలసనేతలే దిక్కా ?
X

రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఇలా తయారైంది. విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. టీడీపీ, జనసేనతో పొత్తు కారణంగా కమలం పార్టీ ఆరు పార్లమెంటు స్ధానాలకే పరిమితమవ్వాల్సొచ్చింది. పోటీచేయబోయే స్ధానాలను పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అరకు, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, నరసాపురం, రాజంపేట నియోజకవర్గాల్లో పోటీ దాదాపు ఖాయమైందని సమాచారం. పైగా ఆరుస్ధానాల్లో మూడింటిని మార్చుకుని విశాఖపట్నం, విజయవాడ, హిందుపురం సీట్లు కావాలని చంద్రబాబుతో బీజేపీ మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇక్కడ విషయం ఏమిటంటే పార్టీ పోటీచేయబోయే సీట్లు ఏవి అన్న విషయాలను పక్కనపెట్టేస్తే అభ్యర్ధులు మాత్రం ఎక్కువమంది వలసనేతలే ఉంటారన్నది ఖాయమైపోయింది. పార్టీలో మొదటినుండి పనిచేస్తున్న సీనియర్లను కాదని ఈమధ్యనే పార్టీలో చేరినవారిని ఇంకా చేరని వారికే టికెట్లంటు మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చాలామంది సీనియర్లు మండిపోతున్నారు. ఇలాంటి వలసనేతలకు ఎట్టి పరిస్ధితుల్లోను టికెట్లు ఇవ్వకూడదని సీనియర్లలో చాలామంది గట్టిగా వాదిస్తున్నారట. అరకు నుండి కొత్తపల్లి గీత పోటీచేస్తారంటున్నారు. ఈమె వైసీపీ ఎంపీగా పనిచేశారు. భూకబ్జా కేసులో తెలంగాణా పోలీసులు అరెస్టుచేస్తే బెయిల్ మీద బయటున్నారు.

అనకాపల్లి సీటులో సీఎం రమేష్ పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి లేదా పురందేశ్వరి పోటీకి రెడీ అవుతున్నట్లు సమాచారం. సరే, ఈమె అధ్యక్షురాలు కాబట్టి వలస నేతే అయినా టికెట్ ఇవ్వక తప్పదు. మరి ఆమె పోటీచేయని రెండోసీటులో సుజనాచౌదరి, నరసాపురంలో రఘురాజు, రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీచేస్తారని అంటున్నారు. పురందేశ్వరి విషయాన్ని మినహాయిస్తే మిగిలిన నేతలను పార్టీలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

పొత్తులు, సీట్ల సర్దుబాటు సందర్భంగా నోరెత్తని పార్టీలోని చాలామంది సీనియర్లు ఇపుడు సడెన్ గా పార్టీ అగ్రనేతల తీరుపైన, పోటీచేయబోతున్న ఆశావహుల పేర్లపైన గోల చేస్తుండమే ఆశ్చర్యంగా ఉంది. అగ్రనేతలు తాము అనుకున్నట్లుగా పై నేతలనే పోటీలోకి దింపుతారా ? లేకపోతే వీళ్ళ వాదనను పరిగణలోకి తీసుకుని జీవీఎల్ నరసింహారావు, సోమువీర్రాజు, సీతారామంజనేయుల చౌదరి లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తారా అన్నది చూడాలి.