Begin typing your search above and press return to search.

బీజేపీకి మరో మంత్రి పదవి.. చంద్రబాబుపై ఢిల్లీ పెద్దల ఒత్తిడి!

కూటమి ప్రభుత్వంలో మరో బెర్త్ కోసం బీజేపీ పెద్దలు స్కెచ్ వేస్తున్నారా? అన్న అనుమానాలు ఎక్కువవుతున్నాయి.

By:  Tupaki Desk   |   1 Jun 2025 6:30 AM
బీజేపీకి మరో మంత్రి పదవి.. చంద్రబాబుపై ఢిల్లీ పెద్దల ఒత్తిడి!
X

కూటమి ప్రభుత్వంలో మరో బెర్త్ కోసం బీజేపీ పెద్దలు స్కెచ్ వేస్తున్నారా? అన్న అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో ఒక బెర్త్ దక్కించుకున్న బీజేపీ.. మరో పదవి కావాలంటూ ఇటీవల ఇండెంట్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అన్నివిధాలా సహకరిస్తున్న తమకు సముచిత స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పెద్దలు ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే బీజేపీ పెద్దల ప్రతిపాదనలను టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని తీసుకున్న బీజేపీ మళ్లీ మంత్రి పదవిని కోరడం కరెక్టు కాదని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సీఎం చంద్రబాబు ఏమంటారోనన్న భయంతో ఈ విషయంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు.

రాష్ట్ర మంత్రివర్గంలో మరో పదవి కావాలంటూ కమలం పార్టీ పెద్దలు ప్రతిపాదించడం టీడీపీ ఆశావహుల్లో గుబులు రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కోసం ఎమ్మెల్యే పదవులను త్యాగం చేస్తే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవులతోపాటు రాజ్యసభ స్థానాలను వదులుకోవాల్సివస్తుండటంపై టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీలకు 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎన్నికల ముందు చివరి క్షణంలో కూటమి కట్టిన బీజేపీ పది సీట్లు దక్కించుకుంది. అప్పటికే ఎమ్మెల్యే సీట్లు ప్రకటించినా, బీజేపీ కోసం వెనక్కి తగ్గి పది సీట్లు కేటాయించింది టీడీపీ. ఇందులో 8 సీట్లు గెలిచి ఒక మంత్రి పదవిని తీసుకుంది బీజేపీ. అయితే ఏడాది కిందట తమకు మంత్రి పదవులు కన్నా రాజ్యసభ స్థానాలు ఎక్కువ ఇవ్వాలని కోరిన కలమం పెద్దలు ఇప్పుడు మడతపేచీ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఏడాదిలో రెండు రాజ్యసభ స్థానాలు తీసుకున్న బీజేపీ.. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మరో పదవి కేటాయించాలని కోరుతుండటమే చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం మరోకరికి మంత్రిగా అవకాశం ఇవ్వొచ్చు. ఈ పదవి ఇప్పటికే జనసేన నేత నాగబాబుకు రిజర్వు చేశారు. నాగబాబును మంత్రివర్గంలో తీసుకుంటానని ఆర్నెల్ల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా నాగబాబు పేరు ఉంటుందని అంటున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాకముందే పునఃవ్యవస్థీకరణ అంటే సబబు కాదన్న ఆలోచనతో ఇన్నాళ్లు వేచిచూశారని అంటున్నారు. ఇక మరో 11 రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తవుతుంది. దీంతో వచ్చేనెలలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందంటున్నారు.

వచ్చేనెలలో జనసేన నేత నాగబాబును మంత్రివర్గంలో తీసుకుంటారని, ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలకు సీఎం చంద్రబాబు ఇప్పటికే చెప్పారంటున్నారు. అయితే నాగబాబుతోపాటు మరో బీజేపీ ఎమ్మెల్యేను మంత్రిని చేయాలని కమలం పెద్దాలు ప్రతిపాదించారని చెబుతున్నారు. ప్రస్తుత మంత్రుల్లో పనితీరు ఆధారంగా ముగ్గురిని తొలగించే అవకాశం ఉన్నందున వారి స్థానంలో తమకు ఓ మంత్రి పదవి ఇవ్వాలని కమలం నేతలు కోరడంతో టీడీపీ నేతలు షాక్ తిన్నారని అంటున్నారు. ప్రస్తుత మంత్రుల్లో ఉత్తరాంధ్ర, గోదావరి, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ముగ్గురికి ఉద్వాసన ఉంటుందని చెబుతున్నారు. ఏడాదిగా వారి పనితీరుపై సీఎం అసంతృప్తితోనే ఉన్నారంటున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నేరుగా వారితో మాట్లాడినా, పరిస్థితిలో మార్పులేదని చెబుతున్నారు. అదేసమయంలో బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ పనితీరుపై చంద్రబాబు సంతృప్తిగా ఉన్నందున ఆయనను మెప్పించేలా మరో నేత కూడా పనిచేస్తారని ఢిల్లీ పెద్దలు సీఎం చంద్రబాబుతో అన్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న ప్రచారం జరుగుతోంది. కానీ, టీడీపీ నేతలు మాత్రం బీజేపీ ప్రతిపాదనపై ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.