రేషన్ దుకాణాలపై జగన్ అక్కసు.. వాస్తవాలు పట్టవా?!
తాజాగా జూన్ 1 ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలను తిరిగి ప్రారంభించారు. గత వైసీపీ హయాంలో మూతబడిన రేషన్ దుకాణాలను తిరిగి తెరిచారు.
By: Tupaki Desk | 2 Jun 2025 1:30 AMతాజాగా జూన్ 1 ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలను తిరిగి ప్రారంభించారు. గత వైసీపీ హయాంలో మూతబడిన రేషన్ దుకాణాలను తిరిగి తెరిచారు. అయితే.. ఈ విధానం రేషన్ పొందుతున్న లబ్ధిదారుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం అక్కసు వెళ్లగక్కారు. 'డోర్ డెలివరీ'ని తొలగించడంపై మండిపడ్డారు. ''చంద్రబాబు పేదలపై కక్ష పెంచుకున్నారు'' అని ఏవేవో అసందర్భ వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్నీ ఆలోచించి.. అడుగులు వేసింది. నాలుగు రకాలుగా సర్వే చేసింది. రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా.. దీనిపై లబ్దిదారుల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. అంతేకాదు.. ఇప్పటి వరకు ఉన్న రేషన్ వాహనాల పనితీరును కూడా అంచనా వేసింది. వాటికి అవుతున్న ఖర్చును కూడా భేరీజు వేసుకుంది. ఈ సర్వేలో మెజారిటీ లబ్ధిదారులు వాహనాల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు.
ఇక, వాహనాల ద్వారా.. రేషన్ అక్రమార్కుల వద్దకు చాలా వేగంగా సునాయాసంగా.. కూడా వెళ్లిపోతోందని ప్రభుత్వం నిర్ధారించుకుంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా చెప్పుకొచ్చారు. సో.. ఇలా అన్ని రూపాల్లోనూ.. అన్ని కోణాల్లోనూ పరిశీలించిన తర్వాతే.. రేషన్ దుకాణాలను ప్రభుత్వం తిరిగి తెరిచింది. అయినా.. జగన్ వీటిని పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వం ఏదో కక్ష పూరితంగా చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి కక్షపూరితంగా చేసే ప్రభుత్వమే అయితే.. పింఛన్లను ఎందుకు పెంచుతుంది? డీఎస్సీ ఎందుకు వేస్తుంది? గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఎందుకు ఇస్తుంది? అనేది జగనే ఆలోచించుకోవాలని అంటున్నారు టీడీపీ నాయకులు. ``ప్రభుత్వ సేవల డోర్డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా?`` అన్న జగన్ కామెంట్లను తప్పుబడుతున్నారు. ఇందులో విజన్ ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు.