ఈ అమాత్యుల రూటే సెపరేటు.. తెలుసా ..!
మంత్రులందు.. ఈ మంత్రుల రూటు వేరయా! అన్నట్టుగా కూటమి ప్రభుత్వంలో పలువురు మంత్రులు వ్యవహరిస్తున్నారు.
By: Tupaki Desk | 23 April 2025 7:30 PMమంత్రులందు.. ఈ మంత్రుల రూటు వేరయా! అన్నట్టుగా కూటమి ప్రభుత్వంలో పలువురు మంత్రులు వ్యవహరిస్తున్నారు. వీరిలో మహిళా మంత్రులు కూడా ఉండడం గమనార్హం. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎప్పుడో కానీ.. బయటకు రావడం లేదని పేరు తెచ్చుకున్నారు. పైగా.. వివాదం ఎలాంటిదైనా.. తనదైన శైలిలో వైసీపీని ఇరికించి.. విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనే దానితో సంబంధం లేదు.
ఇక, మంత్రి నారాయణ.. సొంత నియోజకవర్గానికి విజిటింగ్ ఎమ్మెల్యేగా మారిపోయారట. ఆయనకు సీఎం చంద్రబాబు రాజధాని బాధ్యతలు అప్పగించారు. కానీ, ఇక్కడ రాజధాని పనులు చూసుకునేందుకు సీఆర్డీఏ ఉంది. అప్పుడప్పుడు.. మంత్రి జోక్యం చేసుకుంటే సరిపోతుంది. కానీ, మంత్రి నారాయణ నియోజకవర్గం కన్నా.. రాజధాని సుఖమని భావిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో మంత్రి జాడ కనిపించడం లేదు. ఇది.. ఆయనకు మైనస్ అవుతోంది. పైగా.. ఇక్కడ గొడవల కారణంగానే.. మంత్రి రావడం లేదన్న చర్చ కూడా ఉంది.
మంత్రి సంధ్యారాణి రూటు మరో విధంగా ఉంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఆమె.. అప్పడ ప్పుడు సమస్యలు.. పేరుతో ప్రజలను కలుసుకునేందుకు అప్పుడప్పుడు వస్తున్నారు. పైగా.. అసలు సమ స్యలే లేవని చెబుతున్నారట. దీంతో నియోజకవర్గం మాట ఎలా ఉన్నా.. జిల్లాలో మంత్రి వర్యులపై కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. `మా తరఫున మాట్లాడమని మేంఅడగడం లేదు. కానీ, సమస్యలు పట్టించుకోవాలి కదా! ` అని విజయనగరం జిల్లాకు చెందిన తమ్ముళ్లు ఇటీవల వ్యాఖ్యానించారు.
ఇక, మంత్రి సవిత పరిస్థితి చెప్పుకొంటే.. పెనంపై నుంచి పొయ్యిలో పడినట్టు ఉందట. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ.. బీసీ సంక్షేమానికి ప్రాధాన్యంఇస్తున్నామని చెప్పే ఆమెకు.. తన సొంత నియోజకవర్గంలో మాత్రం తమ్ముళ్ల నుంచి సెగ పుడుతోంది. ఇటీవల వర్గ పోరు ఎక్కువై.. మంత్రి ముందే తమ్ముళ్లు తన్నుకునే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం.. వర్గాలను మంత్రి ప్రోత్సహిస్తున్నారట. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన ఉండడంతో మంత్రి నియోజకవర్గం వైపు వెళ్లేందుకు కూడా జంకుతున్నారట. ఇదీ.. సంగతి!