Begin typing your search above and press return to search.

నేడో..రేపో... జగట్ టీం అరెస్టు? హైకోర్టు నుంచి లైన్ క్లియర్

ఏపీ లిక్కర్ స్కాంలో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

By:  Tupaki Desk   |   2 May 2025 11:05 AM
నేడో..రేపో... జగట్ టీం అరెస్టు? హైకోర్టు నుంచి లైన్ క్లియర్
X

ఏపీ లిక్కర్ స్కాంలో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ టీం పెట్టుకున్న పిటిషనును హైకోర్టు విచారించింది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో గత ప్రభుత్వంలో జగన్ ఓఎస్డీగా పనిచేసిన క్రిష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, గోవిందప్ప అరెస్టుకు లైన్ క్లియర్ అయినట్లేంది. లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన కొందరు నిందితులు తమ పేర్లు చెప్పినందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఈ ముగ్గురు వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు.

ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డితోపాటు మరికొందరిని అరెస్టు చేసింది. వీరిచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, నిందితులు తమ పేర్లు చెప్పారని, వారి రిమాండ్ రిపోర్టులు ఆధారంగా తమను అరెస్టు చేసే అవకాశం ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన పలువురు అధికారులు, వైసీపీ నేతలు భయపడుతున్నారు.

దీంతో గత ప్రభుత్వంలో ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి అరెస్టు చేసే అంశమై ఆందోళన చెందుతున్నారు. ఈ ఇద్దరితోపాటు మద్యం స్కాంలో పాత్రధారిగా అనుమానిస్తున్న బాలాజీ గోవిందప్ప సైతం ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాల్సిందిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కోరింది. సిట్ అధికారులతో పిటిషన్ దాఖలు చేస్తామని పీపీ చెప్పడంతో పిటిషనర్లకు ఇప్పటికిప్పుడు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం తర్వాతే బెయిల్ పై నిర్ణయం వెలువరిస్తామని చెప్పింది. విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా, హైకోర్టు నిర్ణయంతో జగన్ టీంలో కీలక అధికారులుగా పనిచేసిన క్రిష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.