Begin typing your search above and press return to search.

బాబు ఢిల్లీ టూర్ : అమరావతికి కేంద్రం నిధులు ?

ఏపీ రాజధాని అమరావతి గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నారు. బిగ్ స్కేల్ మీద డిజైన్లు రూపొందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 July 2025 9:19 AM IST
బాబు ఢిల్లీ టూర్ : అమరావతికి కేంద్రం నిధులు ?
X

ఏపీ రాజధాని అమరావతి గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నారు. బిగ్ స్కేల్ మీద డిజైన్లు రూపొందిస్తున్నారు. ప్రపంచ రాజధానిగా అమరావతి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. అయితే అమరావతి కోసం ఐకానిక్ టవర్స్ నిర్మించాలని లేక రాజధానికి వరల్డ్ క్లాస్ లుక్ రావాలంటే రూపాయికి పది రూపాయలు ఖర్చు పెడితేనే అయ్యేది.

ఉదాహరణకు హైకోర్టు భవనాల నిర్మాణాలకే ఏకంగా 11 వందల కోట్ల దాకా అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఏపీ లెజిస్లేటివ్ కాంప్లెక్స్ కోసం 600 కోట్లు ఖర్చు అవుతాయని లెక్క వేస్తున్నారు. అమరావతిలో నీరుకొండ వద్ద ఆరు వందల అడుగుల ఎత్తున ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దాని కోసం ఏకంగా మరో 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు.

అమరావతిలోని ఐకానిక్ వంతెన నిర్మాణం కోసం 2600 కోట్ల దాకా అవుతుందట. అలాగే ఇంటర్నల్ రింగ్ రోడ్డు కోసం 8,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని కూడా లెక్క వేస్తున్నారు. ఇవన్నీ అమరావతికి అవసరమైనవే. పైగా అద్భుత కట్టడాలుగా చిరస్థాయిగా ఉండాలంటే ఈ కట్టడాలు అవసరం అని అంటున్నారు.

మరో వైపు ఇవి కాకుండా అమారవతిలో ఇరవై నుంచి పాతిక దాకా భారీ మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. అవి కూడా వేల కోట్లతో రూపొందిస్తున్నవే. వాటి అంచనాలు కూడా భారీ ఎత్తున ఉన్నాయి. వాటికి ఇప్పటిదాకా నిధుల కొరత కారణంగా పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయలేదని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచ బ్యాక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కలసి అమరావతి కోసం అప్పులు ఇస్తున్నాయి. అయితే విడతల వారీగా ఈ నిధులు వస్తాయి. ఇక ప్రపంచ బ్యాంక్ బృందాలు తాజాగా వచ్చి అన్నీ పరిశీలించి వెళ్ళాయి. ఇంకో వైపు చూస్తే ఈ రెండు బ్యాంకులు ఇస్తున్న రుణాలు సరిపోవు అంటున్నారు పైగా ఈ రుణాలకు వడ్డీలు కూడా అధికం అవుతాయని అంటున్నారు.

ఇంకో వైపు సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ గా అమరావతిని మార్చాలంటే ముందుగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి. అంతే కాదు కీలక కట్టడాలు అన్నీ ప్రభుత్వమే పూర్తి చేయాలి. 2028 అన్నది తొలిదశ అమరావతి పనుల పూర్తికి పెట్టుకున్నారు. ఇలా చూస్తే కనుక మొదట తీసుకున్న 33 వేల ఎకరాలా భూములలో వరదలను అడ్డుకునేందుకు నిర్మాణాలు, అలాగే రిజర్వాయర్ల నిర్మాణాలు ఇతరత్రా కట్టడాలు చేపట్టాల్సి ఉంది, వాటికి చాలా భూములు పోతాయని అంటున్నారు.

అమరావతి వంటి ప్రపంచ రాజధానిని అభివృద్ధి చేసి మిగులు భూములు విక్రయిస్తేనే ఆ వచ్చే నిధులతో అప్పులు ఎన్ని ఉన్నా తీర్చవచ్చు. అపుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అవుతుంది అన్నది అంటున్నారు.

ఈ క్రమంలోనే రెండవ విడత భూ సమీకరణ ప్రభుత్వం చేపట్టింది. అయితే దానికి ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయని అంటున్నారు.

అయితే ఇపుడు అమరావతిలో భారీ నిర్మాణాలకు అవసరమైన వాటికి నిధులు పెద్ద ఎత్తున అవసరం పడుతున్నాయని అంటున్నారు. దాంతో కేంద్రం వద్దకు కీలక ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు అని అంటున్నారు. ఆయన ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలసి అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ఇచ్చే రుణాలను కేంద్ర గ్రాంట్లుగా మార్చాలని అతి ముఖ్యమైన విన్నపం చేయబోతున్నారు అని అంటున్నారు.

అదే విధంగా అమరావతి రాజధాని అన్నది ఒక రూపు వచ్చేందుకు కేంద్రం తన వంతుగా ఇతోధిక సాయం ఆర్ధికంగా చేయాలని కోరబోతున్నారు అని అంటున్నారు. కేంద్రం కనుక తలచుకుంటే అమరావతి ఒడ్డున పడినట్లే. మరి ఈ విషయంలో ఏమి జరుగుతుంది ఏ రకమైన హామీలు దక్కుతాయన్నది చూడాల్సిందే అంటున్నారు. మొత్తానికి చూస్తే అమరావతి రాజధానికి ఇపుడు కేంద్రం నుంచి భారీ ఆర్థిక సాయం అవసరం అవుతోంది అని అంటున్నారు.