Begin typing your search above and press return to search.

'మే' ఆఖరి పోరులో.. ముగ్గురికి హిట్టు కావాలి!

సినిమా రంగం ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ, మే చివరి వారంలో మూడు కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయి

By:  Tupaki Desk   |   25 May 2024 9:30 AM GMT
మే ఆఖరి పోరులో.. ముగ్గురికి హిట్టు కావాలి!
X

సినిమా రంగం ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ, మే చివరి వారంలో మూడు కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాల్లో నటించిన ముగ్గురు హీరోలు కూడా మంచి సక్సెస్ అందుకొని మరో రేంజ్ కు వెళ్లాలని చూస్తున్నారు. ఇక బయ్యర్స్ నూతన ఆశలు పెంచుకున్నారు. మే 31న విశ్వక్ సేన్ నటించిన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి", కార్తికేయ "భజే వాయు వేగం", ఆనంద్ దేవరకొండ "గంగం గణేశా" సినిమాలు విడుదల కానున్నాయి.

"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమాను డిసెంబర్ నుంచి వాయిదా పడుతూ వచ్చి చివరకు ఈ నెల చివరికి విడుదల చేయనున్నారు. విశ్వక్ సేన్ ఊర మాస్ పాత్రలో కనిపించడం, నేహా శెట్టి మరియు అంజలి గ్లామర్ తో పాటు కృష్ణ చైతన్య దర్శకత్వం, సితార నిర్మాణం అంచనాలను పెంచుతున్నాయి. పల్లెటూరి నేపథ్యంతో ఈ సినిమా ప్రేక్షకుల మనసును దోచుకోగలదా అన్నది ఆసక్తిగా మారింది.

కార్తికేయ నటించిన "భజే వాయు వేగం" కూడా మే 31న విడుదల కానుంది. హిట్ సినిమాలు లేక కొంతకాలంగా ఉన్న కార్తికేయకు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందనే ఆశలు ఉన్నాయి. యువి సంస్థ బడ్జెట్ మరియు బిజినెస్ పరంగా ఈ ప్రాజెక్టును బలంగా మద్దతు ఇస్తోంది. ప్రమోషన్లు బాగా చేస్తుండడంతో, ఆడియెన్స్ లో ఈ సినిమా పై ఆసక్తి పెరుగుతోంది.

మరోవైపు ఆనంద్ దేవరకొండ నటించిన "గంగం గణేశా" అదే రోజు రాబోతోంది. "బేబీ" సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ మీద ఉన్న అంచనాలు ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత మరింత పెరిగాయి. క్రైమ్ కామెడీగా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించగలదా అనేది ఆసక్తిగా మారింది. ఆనంద్ దేవరకొండ విస్తృతంగా పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, సినిమా పై ఆసక్తిని పెంచుతున్నారు.

అయితే, ఈ మూడు సినిమాలూ ఒక ముఖ్యమైన అడ్డంకిని ఎదుర్కొంటున్నాయి. మే 31 తర్వాత నాలుగు రోజుల గ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఎన్నికల ఫలితాలపై జనాలు ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల, మొదటి వారంలో కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రారంభం సాధించగలిగితే, ప్రేక్షకులు సినిమా హాళ్లకు రావడానికి ఇబ్బంది ఉండకపోవచ్చు.

కానీ, ఏవైనా యావరేజ్ గా అనిపిస్తే మొదటి వారంలో ఇబ్బందులు తప్పవు. ఈ కుర్ర హీరోలు ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొని విజయం సాధిస్తారో లేదో చూడాలి. మొత్తానికి, మే చివరి వారంలో ఈ మూడు సినిమాలు టాలీవుడ్ కి కొత్త ఉత్సాహాన్ని తెచ్చే అవకాశం ఉంది. ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా కంటెంట్ ఉంటే, బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.