ప్రీ రిలీజ్ ఈవెంట్కి సూపర్ స్టార్...!
కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'రెట్రో' ఒకటి. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న రెట్రో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి
By: Tupaki Desk | 10 April 2025 5:25 PMకోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'రెట్రో' ఒకటి. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న రెట్రో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. అందుకే ఈ సినిమా కచ్చితంగా సూర్య ఫ్యాన్స్ను మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారిని మెప్పించడం ఖాయం అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. రెట్రో సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పాటతో పాటు, టీజర్ అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. మే 1న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.
సూర్య గత చిత్రం 'కంగువా' ఫలితం కారణంగా తదుపరి సినిమాకి మార్కెట్ కాస్త డౌన్ ఉండే అవకాశం ఉందని మొదట భావించారు. కానీ కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను రూపొందించిన తీరుతో పాటు, ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ స్టఫ్ కారణంగా అంచనాలు పెరిగాయి. కంగువా ప్రభావం రెట్రో పై కనిపించకుండా పోయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 18న చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో ట్రైలర్ లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని కోలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయని సమాచారం.
సూపర్ స్టార్ రజనీకాంత్తో కార్తీక్ సుబ్బరాజు పేట సినిమాను రూపొందించిన విషయం తెల్సిందే. కమర్షియల్గా ఆ సినిమా నిరాశ పరచినా కూడా రజనీకాంత్కి కార్తీక్ సుబ్బరాజ్ పై గట్టి నమ్మకం ఏర్పడింది. దాంతో మరోసారి ఆయనతో వర్క్ చేయాలని భావిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఆ విషయమై క్లారిటీ రాలేదు. కానీ 'రెట్రో' సినిమా ప్రీ రిలీజ్ కి రజనీకాంత్ హాజరు అయితే కచ్చితంగా పేట కాంబో రిపీట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా అంటే విభిన్నంగా ఉంటుంది. ఆయన కథలు, ఆయన స్క్రీన్ ప్లే ఇతరుల మేకింగ్కి చాలా విభిన్నంగా ఉంటుంది. కనుక ఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసంతో సూర్య ఫ్యాన్స్ ఉన్నారు.
సూర్య గత చిత్రం కంగువాతో పోల్చితే తక్కువ బడ్జెట్తో రెట్రో సినిమాను రూపొందించిన కారణంగా ముందుగానే ఈ ప్రాజెక్ట్ సేఫ్ జోన్లో పడ్డట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్తో రూపొందిన ఈ సినిమాను స్టోన్ బెంచ్ క్రియేషన్స్ బ్యానర్తో కలిసి సూర్య తన సొంత బ్యానర్లో నిర్మించాడు. కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ద్వారా ఏకంగా రూ.75 కోట్లకు మించి వచ్చినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ ద్వారా మరో రూ.75 కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమాకు మినిమం పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు చేయడం ఖాయం. సూపర్ స్టార్ ప్రజెన్స్తో సినిమా పై మరింతగా అంచనాలు పెరిగి, మంచి ఓపెనింగ్స్ దక్కవచ్చు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.