సూర్య క్రేజీ లైనప్..ఈసారి గట్టిగానే ప్లాన్ చేశాడుగా!
కోలీవుడ్ స్టార్స్లలో సూర్యకున్న ప్రత్యేకతే వేరు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన కథలని, క్యారెక్టర్లని ఎంచుకుంటూ వెర్సటైల్ ఆర్టిస్ట్గా తన ప్రత్యేకతను చాటుకున్నారు.
By: Tupaki Desk | 15 Feb 2026 6:00 PM ISTకోలీవుడ్ స్టార్స్లలో సూర్యకున్న ప్రత్యేకతే వేరు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన కథలని, క్యారెక్టర్లని ఎంచుకుంటూ వెర్సటైల్ ఆర్టిస్ట్గా తన ప్రత్యేకతను చాటుకున్నారు. సౌత్ ఇండియాలోనే విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్నారు. కొత్త తరహా కథలతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని దశాబ్దాల కాలంగా అలరిస్తున్న సూర్య ఈ మధ్య కాస్త రేసులో వెనకబడ్డారు. సూరారైపోట్రు` (ఆకాశం నీ హద్దురా), .జై భీమ్ వంటి సినిమాలతో సూపర్ హిట్లని సొంతం చేసుకున్నా మళ్లీ ట్రాక్ తప్పారు.
ఈ రెండు హిట్ల తరువాత వరుసగా ఫ్లాపుల్ని ఎదుర్కొన్న సూర్య ఫైనల్గా మళ్లీ తన ట్రాక్లోకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఇందు కోసం పవర్ఫుల్ స్టోరీస్ని ఎంచుకుని ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే రెండు క్రేజీ ప్రాజెక్ట్లని పట్టాలెక్కించిన సూర్య మరో క్రేజీ డైరెక్టర్తో సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. తన 45వ ప్రాజెక్ట్గా సూర్య `కరుప్పు`ని చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్.జె. బాలాజీ ఈ మూవీకి డైరెక్టర్. భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
తమిళ నేటివిటీకి తగ్గ రూటెడ్స్టోరీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య రెండు విభిన్నమైన క్యారెక్టర్లలో కనిపించి ఆకట్టుకోబోతున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. సూర్య లాయర్గా కనిపిస్తూనే సొసైటీలో జరిగే అన్యాయాలని అరికట్టే కరుప్పుగా కనిపించనున్నాడు. డివోషనల్ టచ్తో సాగే ఈ మూవీ ద్వారా సోషల్ మెసేజ్ని కూడా అందిస్తున్నారు. త్రిష, సూర్య జోడి కోలీవుడ్లో హిట్ పెయిర్. అయితే కొన్నేళ్లుగా వీరు కలిసి నటించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో దీనిపై అంచనాలు తమిళనాట తారా స్థాయికి చేరుకున్నాయి.
ఈ క్రేజీ మూవీ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తరువాత సూర్య తన 46వ ప్రాజెక్ట్ని తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేస్తున్న విషయం తెలిసిదే. సార్, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో ఫ్యామిలీ ఎమోషన్స్ని బాగా పండించగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి సూర్య తో చేస్తున్న సినిమాని కూడా అదే ఫార్ములాని ఉపయోగించి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలిసింది. ఇందులో సూర్యకు జోడీగా `ప్రేమలు` బ్యూటీ మమితా బైజు నటిస్తుండగా కీలక పాత్రలో రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ నటిస్తున్నారు.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తయింది. అయితే ఈ మూవీని `కరుప్పు` రిలీజ్ అయిన మూడు లేదా నాలుగు నెలల తరువాత రిలీజ్ చేయబోతున్నామని నిర్మాత ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. అంతే ఆయన మాటల ప్రకారం ఈ మూవీ జూలై లేదా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొస్తుందని తెలుస్తోంది. ఇక సూర్య తన 47వ మూవీని జీతు మాధవన్ తో చేస్తున్నాడు. ఇది కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్. ఇందులో సూర్య పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. నజియా హీరోయిన్. `ప్రేమలు` నస్లెన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నాడు. ఇలా వరుసగా క్రేజీ లైనప్ని సెట్ చేసుకున్న సూర్య ఈ సారి గట్టిగా ప్లాన్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది.
