Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పై కోలీవుడ్ హీరోల దండయాత్ర..!

By:  Tupaki Desk   |   19 Feb 2022 4:30 PM GMT
టాలీవుడ్ పై కోలీవుడ్ హీరోల దండయాత్ర..!
X
తమిళ హీరోల్లో చాలామందికి టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. తెలుగు సినిమాలను మించి వసూళ్లు రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకే వారు నటించే ప్రతీ చిత్రాన్ని డబ్బింగ్ చేసి ఇక్కడ కూడా రిలీజ్ చేస్తుంటారు. ఈ సమ్మర్ సీజన్ లో ప్రేక్షకులను అలరించడానికి తెలుగు హీరోలతో పాటుగా కోలీవుడ్ హీరోలు కూడా రెడీ అయ్యారు. తెలుగు చిత్రాల రిలీజ్ డేట్స్ విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. మధ్యలో తమిళ సినిమాలు దండయాత్ర చేయడానికి వస్తున్నాయి.

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''వలిమై''. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మించారు. ఇందులో హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటించగా.. టాలీవుడ్ యువ హీరో కార్తికేయ విలన్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్ర‌వ‌రి 24న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేయబడిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై అంచనాలను పెంచేసింది.

తమిళ వర్సటైల్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ''ఈటీ''. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు దక్షిణాది భాషల్లో మార్చి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 'ఆకాశం నీ హద్దురా' 'జై భీమ్' వంటి రెండు వరుస ఓటీటీ బ్లాక్ బస్టర్స్ తర్వాత సూర్య నుంచి థియేట్రికల్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో తన పాత్రకు సూర్య తొలిసారిగా స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పడం గమనార్హం.

ఇళయ దళపతి విజయ్ - పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ''బీస్ట్''. డాక్టర్' ఫేమ్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ కళానిధి మారన్ నిర్మించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో ఈ యాక్షన్ థ్రిల్లర్ ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇంకా డేట్ ఫిక్స్ చేయనప్పటికీ.. ఏప్రిల్ 14న లేదా ఏప్రిల్ 29న విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న విజయ్ నుంచి రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''విక్రమ్''. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి - మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'ఖైదీ' 'మాస్టర్' సినిమాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్ హోమ్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ''సార్''. టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపేలా ఎడ్యుకేషన్ మాఫియాతో ఓ లెక్చరర్‌ ఎలా పోరాడారు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇది ధనుష్ నటించే ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్పై క్రైమ్ థ్రిల్లర్ ''సర్దార్''. పీఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కార్తీ డ్యూయెల్ రోల్ లో కనిపించనుండగా.. రాశీ ఖన్నా - రాజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి స్పందన తెచ్చుకుంది. కార్తీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా.. తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ పై క్లారిటీ రానుంది.