Begin typing your search above and press return to search.

'అన్ స్టాపబుల్ 2' వేదికగా త్రివిక్రమ్ - పూజాలపై ఫన్నీ మీమ్స్..!

By:  Tupaki Desk   |   20 Oct 2022 4:24 AM GMT
అన్ స్టాపబుల్ 2 వేదికగా త్రివిక్రమ్ - పూజాలపై ఫన్నీ మీమ్స్..!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ''అన్ స్టాపబుల్ విత్ NBK''. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమైన ఈ షో.. మొదటి సీజన్ ను విజయవంతంగా ముగించింది. ఇప్పుడు లేటెస్టుగా సరికొత్త సీజన్ తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది. ఇటీవలే ''అన్ స్టాపబుల్ 2'' ఫస్ట్ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చేశారు.

బాలయ్య హోస్టింగ్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్టుగా వచ్చిన 'అన్ స్టాపబుల్ 2' మొదటి ఎపిసోడ్ కు అనూహ్య స్పందన లభించింది. ఇది కేవలం 4 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టినట్లు ఆహా టీమ్ ట్వీట్ చేసింది. ఇది ఇండియన్ టాక్ షోలలోనే బిగ్గెస్ట్ అని పేర్కొన్నారు.

ఇక రెండవ ఎపిసోడ్‌ లో టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్ సేన్ మరియు సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథిలుగా పాల్గొంటారు. కుర్ర హీరోలిద్దరూ బాలకృష్ణ తో కలిసి సందడి చేసిన ఈ ఎపిసోడ్‌ కి సంబంధించిన ఆసక్తికరమైన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇందులో భాగంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు బాలయ్య ఫోన్ కాల్ చేస్తాడు. 'అన్ స్టాపబుల్' షోకి ఎప్పుడు వస్తావ్? అని అడగ్గా.. 'మీరు ఓకే అంటే.. ఇప్పుడే వచ్చేస్తా' అని త్రివిక్రమ్ బదులిచ్చారు. దీనికి బాలకృష్ణ వెంటనే ''ఎవరితో రావాలో తెలుసుగా'' అని అంటాడు.

త్రివిక్రమ్ తన స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ తో కలిసి ఈ షోలో పాల్గొనాలనే అర్థంలో బాలయ్య అలా అన్నారు. అయితే కొంతమంది క్రేజీ నెటిజన్లు మాత్రం దీనికి కొన్ని రకాల మీమ్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.

'ఎవరితో రావాలో తెలుసుగా?' అని బాలయ్య అనగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనతో పాటుగా హీరోయిన్ పూజా హెగ్డే ని టాక్ షోకి తీసుకొచ్చినట్లుగా మీమ్స్ క్రియేట్ చేశారు. అంతేకాదు రెండో ఎపిసోడ్ లో పాల్గొన్న నిర్మాత నాగవంశీ ని కూడా ఇందులో భాగం చేశారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడు సినిమాల్లో పూజా హెగ్డే ని హీరోయిన్ గా రిపీట్ చేసిన నేపథ్యంలో.. నెటిజన్లు ఇలాంటి మీమ్స్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 'అరవింద సమేత వీర రాఘవ' 'అల వైకుంఠపురములో' వంటి చిత్రాల్లో పూజా హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు మహేష్ బాబు తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలోనూ బుట్టబొమ్మ నటిస్తున్న సంగతి తెలిసిందే.

నిజానికి SSMB28 ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా పూజా హెగ్డే ని ఫైనలైజ్ చేసినప్పుడే నెట్టింట మీమ్స్ రాయుళ్లు రెచ్చిపోయారు. "రౌండ్ 3.. లెట్స్ గో.." అంటూ పూజా ట్వీట్ చేయడంతో.. నెటిజన్లు తమ స్కిల్స్ అన్నీ ఉపయోగించి ఫన్నీ మీమ్స్ చేస్తూ వైరల్ చేశారు. ఇప్పుడు 'అన్ స్టాపబుల్' ప్రోమోతో మరోసారి తమ క్రియేటివిటీని బయటకు తీశారు.

ఇకపోతే 'అన్ స్టాపబుల్ 2' కు పూజా హెగ్డే లాంటి హీరోయిన్లు కూడా వస్తే.. ఈ షోకి గ్లామర్ కూడా యాడ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అదే జరిగితే అందాల భామలతో బాలయ్య చేసే అల్లరి మామూలుగా ఉండదని కామెంట్స్ చేస్తున్నారు. లాస్ట్ సీజన్ లో రష్మిక మందన్నా తో నటసింహం సందడి చేసిన సంగతి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.