మళ్లీ పోటీచేయను...అన్న ఎమ్మెల్యే బ్యాగ్రౌండ్ తెలుసా?

Update: 2020-01-03 08:02 GMT
సొంత పార్టీ కార్యకర్తలే తనను నిలదీయడంతో విసుగెత్తిపోయి... మళ్లీ ఓట్లు అడగడానికి రాను... ఎన్నికల్లో పోటీ చేయను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్. తన నియోజకవర్గంలోని ఓ ప్రాంతానికి ఆర్థర్ పర్యటనకు వెళ్లగా.. తమకు చెప్పకుండా పర్యటనకు ఎలా వస్తారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన్ని నిలదీశారు. అప్పుడు ఓట్లు అడుక్కోవడానికి వచ్చారు.. ఇప్పుడు మమ్మల్ని లెక్క చేయట్లేదు.. ఇంకోసారి ఓట్లు అడుక్కోవడానికి వచ్చినపుడు చూసుకుంటాం అని కార్యకర్తలు అనడంతో ఎమ్మెల్యే హర్టయిపోయారు. తాను ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చానని.. కానీ వాస్తవం బోధపడిందని.. ఇంకోసారి ఓట్లు అడుక్కోనని.. అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయనని సంచలన ప్రకటన ప్రకటన చేశాడు.

తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి.. అధికారం రుచిచూశాక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ఆర్థర్ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరీ ఆర్థర్ అంటూ సోషల్ మీడియాలో ఆరాలు మొదలయ్యాయి. ఈ ఆర్థర్ నేపథ్యంలో భిన్నమైందే. ఆర్థర్‌ ది కర్నూలు జిల్లానే. ఆయన గతంలో పోలీస్. ఏపీ పోలీస్ డిపార్ట్‌ మెంట్ లో కమాండెంట్ స్థాయిలో పనిచేశారు. వైఎస్ హయాంలో ఆర్థర్ అసెంబ్లీ చీఫ్ మార్షల్‌ గా పనిచేయడం విశేషం. అప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు - మంత్రుల దర్పాన్ని దగ్గరుంచి చూశారు. రాజకీయ నాయకుల పవర్ ఏంటో ఆయనకు అర్థమైంది. అప్పట్లో వైఎస్‌ తో పరిచయం ఏర్పడింది. ఆయన విధానాలకు ఆకర్షితులయ్యారు. వైఎస్ మరణానంతరం జగన్ పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు ఉద్యోగం మానేసి టికెట్ కోసం ట్రై చేసి విఫలమైనప్పటికీ.. 2019లో టిక్కెట్ సంపాదించారు. వైసీపీ వేవ్ బలంగా ఉండటంతో 40 వేల మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Tags:    

Similar News