యశ్వంతాపూర్‌ రైలు ప్రమాదం: విషాద చరితకు..67 ఏళ్లు !

Update: 2021-09-27 07:31 GMT
యావత్‌ భారతదేశం బ్రిటీష్‌ పాలనను అంతమొందించి స్వతంత్ర స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్న సమయం. అప్పటికీ దేశానికి స్వతంత్రం వచ్చి కేవలం ఏడేళ్లు మాత్రమే. అప్పుడప్పుడే పాలన గాడినపడుతున్న సందర్భం.. సరికొత్త రాజ్యాంగం రూపుదిద్దుకున్న నాలుగేళ్లకే ఓ నిశిరాత్రి వేళలో సంభవించిన పెనుప్రమాదం యావత్‌ దేశాన్ని కుదిపేసింది. అంతేకాదు.. ఓ కేంద్ర మంత్రి కలతకు కూడా కారణమైంది. అదే 300 మందిని పొట్టనబెట్టుకున్న యశ్వంతాపూర్‌ రైలు ప్రమాద దుర్ఘటన. ఈ ప్రమాదం జరిగి నేటికి 67 ఏళ్లు పూర్తవుతున్నాయి.

అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి జీటీ- గ్రాండ్‌ టాంక్‌(నిజాముద్దీన్‌) ఎక్స్‌ ప్రెస్‌ 1954 సెప్టెంబరు 27న సోమవారం రాత్రి 7 బోగీలతో ప్రయాణికులను ఎక్కించుకుని హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే సరిగ్గా అప్పటి వరంగల్‌ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ దాటిన కేవలం 5 నిమిషాలకే యశ్వంతాపూర్‌ వాగుపై నిర్మించిన రైల్వేబ్రిడ్జిపైకి రైలు చేరుకున్న గ్రాండ్‌ టాంక్‌ ఘోర ప్రమాదానికి గురైపోయింది. అప్పటికే భారీ వర్షంతో ఉప్పొంగుతున్న వాగును రైలు ఇంజన్‌తో సహా 2 బోగీలు సురక్షితంగా రైల్వేబ్రిడ్జిని దాటి ముందుకు వెళ్లాయి, మిగతా 5 బోగీల్లో నాలుగు బోగీలు సరిగ్గా బ్రిడ్జిపై ఉండగా ఒక్కసారిగా జలప్రవాహం ఉధృతిగా వచ్చి వరదతాకిడి పోటెత్తింది.

ఫలితంగా బ్రిడ్జిపై నుంచి ప్రవాహం ఉప్పెనలా తాకి బ్రిడ్జి కూలిపోయి రైలు బోగీలను బలం గా నెట్టేశాయి. దీంతో రైలు నుంచి నాలుగు బోగీల లింకు ఊడిపోయింది. ఒక్కసారిగా నా లుగు బోగీలు అమాంతం వరదప్రవాహంలో చిక్కుకుపోవడంతో అందులో ఉన్న సుమారు 300 మంది ప్రయాణికులు కుప్పలు తెప్పలుగా జలప్రవాహంలో కొట్టుకుపోయారు. యశ్వంతాపూర్‌ రైలు ప్రమాదంలో జలప్రవాహంలో కొట్టుకుపోయిన శవాల గుట్టలు నీటితెప్పలుగా మారిపోయి ప్రమాదసంఘటనా స్థలం నుంచి 15 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయినట్లు చరిత్ర సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి. యశ్వంతాపురం వాగు లింగాలఘణపురం మండలం నెల్లుట్ల, పటేల్‌ గూడెం, నవాబుపేట, వడ్డిచర్ల, దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామాల మీదుగా ప్రవహించడంతో రైలు ప్రమాదంలో మృతిచెందిన ప్రయాణికుల మృతదేహాలు చెట్టుకొకటి పుట్టకొకటియాయి. వందల శవాలను నాలుగు చోట్లకు చేరవేయడంతో శవాలగుట్టలై కనిపించినట్లు అప్పటి ప్రత్యక్ష సాక్షుల ద్వారా స్పష్టమవుతోంది.

ఏ తల్లి కన్నబిడ్డలో అమ్మ పొత్తిళ్లలో సేదదీరాల్సిన పసిపిల్లలు కొంతమంది.. కుటుంబానికి అన్నీ ఆధారమై పొట్టకూటి కోసం చిరువ్యాపారం చేసుకునే వ్యాపారులు ఇంకొంతమంది.. సుదూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల ఇళ్లలోకి పండుగలు, శుభకార్యాల కోసం వెళ్తున్న వారు మరికొంత మంది ప్రయాణికులకు అదే చివరిప్రయాణంగా మారింది. చూస్తుండగానే సుమారు 300 మంది జలసమాధిలో ప్రాణాలను కోల్పోయి అయినవాళ్లను దుఃఖసాగరంలో ముంచేసిపోయారు. వందలాది మృతదేహాలు వరదప్రవాహంలో కొట్టుకుపోగా స్థానికులు సహాయక చర్యలు అందించినట్లు ఆనాటి చారిత్రక సాక్ష్యాల ద్వారా స్పష్టమవుతోంది. శవాలను గుర్తించేందుకు మృతుల బంధువుల రాకతో యశ్వంతాపురం నెల్లుట్ల, పటేల్‌గూడెం, నవాబుపేట, వడ్డిచర్ల, చిన్నమడూరు, నేలపోగుల గ్రామాలు శోకసంద్రంలో మునిగారు.

తన మంత్రిత్వశాఖ తప్పిదం కారణంగా 300 మంది రైలు ప్రయాణికులు జలసమాధి కావడంతో అప్పటి రైల్వేశాఖ మంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రి తీవ్రంగా కలత చెందారు. తన శాఖ వైఫల్యాల కారణంగా రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. రైలు ప్రమాదం జరిగిన తర్వాత మృతదేహాలను వెలికితీసేందుకు ఓ వైపుసహాయక చర్యలు జరుగుతుండగానే మరో వైపు కొంతమంది మానవత్వాన్ని మరిచిపోయి శవాలపై ఉన్న బంగారు ఆభరణాలను, బ్యాగుల్లోని డబ్బులను దోపిడీ చేసినట్లు స్థానికులు ఇప్పటికి చెబుతుంటారు. కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, లక్షలాది రూపాయలు, బంగారు నాణేలు ఇలా అనేక విలువైన వెండి ఆభరణాలు శవాలపై ఎగబడి చోరీ చేసినట్లు తెలుస్తోంది. అలా ఆర్థికంగా నిలదొక్కుకున్న కు టుంబాలు ఇప్పటికి కూడా ఉన్నట్లు గ్రామాల్లో చర్చలు జరుగుతుంటాయి.


జిల్లాలో చాలా మందిని తమ వయసెంత అని అడిగితే రైలు ప్రమాదఘటననే ప్రామాణికంగా తీసుకుని వయసును అంచనా వేసుకుంటుంటారు. అప్పట్లో నిరక్ష్యరాస్యత శాతం ఎక్కువగా ఉంటుండగా పిల్లలు ఎప్పుడు పు ట్టారో తెలియకపోవడంతో రైలు ప్రమాదం జ రిగినప్పుడు పుట్టాడని, రైలు పడేనాటికి పదేళ్ల పిలగాడని చెప్పుకుంటూ వయసును ప్రామాణికంగా తీసుకుని ఇప్పటికీ లెక్కిస్తారు.

మృత్యువు వెంటాడితే వందమంది వైద్యులు పక్కనే ఉన్న మృత్యువును ఎవరూ ఆపలేకపోతారనే నగ్న సత్యాన్ని యశ్వంతాపురం రైలు ప్రమాదం నిరూపించింది. హైద్రాబాద్‌కు చెందిన ప్యారడైజ్‌ థియేటర్‌ యజమాని అంజయ్య వ్యాపార అప్పట్లో విడుదలైన దొంగరాముడు సినిమా బాక్స్‌లను తీసుకువచ్చేందుకు మద్రాస్‌ వెళ్లాల్సి ఉండగా కాజీపేట వరకు రైలెక్కి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే నిజాముద్దీన్‌ (గ్రాండ్‌ టాంక్‌) రైలు బయలుదేరాల్సిన నిర్ణీత సమయానికి స్టేషన్‌ కు చేరుకోకపోవడంతో ఎలాగైనా జీటీ రైలు ను అందుకోవాలనే లక్ష్యంతో తన కారులో డ్రైవరును వెంటబెట్టుకుని భువనగిరి రైల్వే స్టేషన్‌ కు అతివేంగా వచ్చి చేరుకుని రైలెక్కాడు. అయితే సదరు వ్యాపారి అంజయ్య రైలెక్కిన గంట వ్యవధిలోనే యశ్వంతాపురం వద్ద జరగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయని అప్పటి సాక్షులు చెబుతున్నారు. అయితే మృత్యువు ముంచుకువస్తే ఎవరూ ఆపలేరనే సత్యం ప్యారడైజ్‌ యజమాని రూపంలో నిరూపించిందని ఇక్కడి వారు ఇప్పటికీ ఉదాహరణలుగా చర్చింకుంటుండటం విశేషం.

ఆనాడు 1954 సెప్టెంబరు 27న యశ్వంతాపురంలో జరిగిన రైలు ప్రమాదఘటన నేటికి సరిగ్గా 65 ఏళ్లకు చేరుకుంది. ఆరున్నర దశాబ్ధాల కాలగతిలో కూడా అలనాటి విషాధచరితను జనగామ జిల్లా వ్యాప్తంగా ఇంకా పుంకాను పుంకాలుగా మూఢవిశ్వాసాలతో జోడించి చర్చించుకుంటారు. అంతేకాకుండా విషాధ చరితను పల్లెసుద్దులు, వీధినాటకాలు, భాగవతాలు, ఒగ్గుకథల రూపేణా ఆనాడు జరిగిన దుర్ఘటనను కళ్లకు కట్టినట్లుగా కళాకారులు వివరిస్తుండటం విశేషం. రైలు ప్రమాదం జరిగి వందల మంది చనిపోయి చెట్టుకొకరు, పుట్టకొకరుగా పడిఉన్నారు. అప్పటికి నాకు 25 ఏళ్లు ఉన్నాయి. వాటిని చూస్తేనే నాకు భయమేసింది. బావుల వద్దకు వెళ్లాలంటే చనిపోయిన శవాలే గుర్తుకు వచ్చేది. నవాబుపేట అంగడి ప్రాంతంలోకి కూడా వరదనీరు రావడంతో అక్కడున్న ఇళ్ల మధ్యకు శవాలు కొట్టుకు వచ్చాయి. శవాల కుళ్లిపోయి వారం రోజుల దాకా వాసన వచ్చింది. శవాలను ఒక్కొక్కటి ఏరుకొచ్చి ఒక్కదగ్గర వేస్తే గుట్టలు గుట్టలుగా కనబడ్డాయి. వాటిని లారీల్లో తీసుకుపోయిండ్రు అని స్థానికులు చెప్తారు.
Tags:    

Similar News