రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య వార్ ఏంటి? ఎలా మొదలైంది? అసలేంటి కథ?

Update: 2022-08-05 11:30 GMT
కాంగ్రెస్ లో ఇంతకాలం సాగిన కోల్డ్ వార్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎపిసోడ్ తర్వాత మాటల యుద్ధంలోకి మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ కు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేదాకా వెళ్లింది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నాని ప్రకటిస్తూ.. దానికి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాజగోపాల్ రెడ్డికి బదులిచ్చే క్రమంలోనే రేవంత్ రెడ్డి సైతం రెచ్చిపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన కోరినట్టుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోయినప్పటికీ కాస్త మెత్తబడినట్టుగా తెలుస్తోంది.

తాజాగా రేవంత్ రెడ్డి కాస్త వెనక్కితగ్గారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ వాడని చెప్పుకొచ్చారు. మునుగోడులో ప్రచారానికి సైతం వెంకటరెడ్డి వస్తారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ బ్రాండ్ లేకపోతే కనీసం బ్రాందీషాపులో పనిచేయడానికి కూడా రాజగోపాల్ రెడ్డి పనికిరాడని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి వేర్వేరని.. వెంకటరెడ్డిని తాను విమర్శించాననడంలో నిజం లేదని చెప్పుకొచ్చారు. తమ మధ్య కొందరు అగాథం పెంచుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇక రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి గంటసేపైనా కాకముందే ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకటరెడ్డి. ఇక నుంచి రేవంత్ రెడ్డి ముఖమే చూడనన్నారు. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిపై రాజకీయ విమర్శలకు బదులు..వ్యక్తిగత తమ కుటుంబ బ్రాండ్ ను కించపరిచే వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డిపై వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మాటలు తనను బాధించాయని.. క్షమాపణ చెప్పాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

ఇక తమకు ప్రత్యర్థిగా భావిస్తున్నచెరుకు సుధాకర్ ను తమకు తెలియకుండానే పార్టీలో చేర్చుకోవడంపై వెంకటరెడ్డి మండిపడ్డారు. మునుగోడులో సుధాకర్ ను పెట్టి తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని ఓడిస్తారని వెంకటరెడ్డి అనుమానిస్తున్నారు. ఇదివరకే తనను ఓడించడానికి ప్రయత్నించిన సుధాకర్ ను కాంగ్రెస్ లో ఎలా చేర్చుకుంటారని వెంకటరెడ్డి నిలదీశారు.

ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గంపై దండయాత్ర చేపట్టారు రేవంత్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో బహిరంగ సభ పెట్టి రాజగోపాల్ రెడ్డి తీరును కార్యకర్తలు, నేతల ముందు కడిగిపారేశారు. దీనికి వెంకటరెడ్డిని కూడా రేవంత్ ఆహ్వానించారు. కానీ అక్కడికి వెళ్లి తమ్ముడికి వ్యతిరేకంగా రాజకీయం చేయడం ఇష్టం లేక వెంకటరెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నట్టు తెలిసింది.

ఇక చెరుకు సుధాకర్ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీచేసిన వెంకటరెడ్డిని ఓడించారని పేరుంది. అందుకే సుధాకర్ ను చేర్చుకోవడాన్ని వెంకటరెడ్డి విమర్శిస్తున్నారు. మునుగోడులో ఏకంగా లక్ష బీసీ ఓట్లు ఉన్నాయి. గౌడ సామాజికవర్గానికి చెందిన చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ లో చేర్చుకొని రేవంత్ రెడ్డి ఆ టికెట్ ను ఆయనకు ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని ఓడించే ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే తన 'తెలంగాణ ఇంటిపార్టీ'ని కూడా కాంగ్రెస్ లో విలీనం చేశారు.

మొత్తంగా పైకి మామూలుగానే కనిపిస్తున్న రేవంత్ రెడ్డి తెరవెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ శత్రువును తెరపైకి తేవడంతో వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. వీరి వైరం ఇప్పుడు పతాకస్థాయికి చేరింది. వెంకటరెడ్డి బరెస్ట్ కావడానికి కూడా ఇదే కారణంగా చెప్పొచ్చు.
Tags:    

Similar News