ఓట్లను కొనేస్తున్నారు.. హీరోగారి ఆవేదన!

Update: 2019-04-15 11:48 GMT
పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలూ ఓట్లను కొనుగోలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర. ఈ సారి ఎన్నికల్లో తన పార్టీని పోటీకి దించిన ఉపేంద్ర సమకాలీన రాజకీయాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్ని పార్టీల వాళ్లూ ఓటర్లను డబ్బుతో ప్రభావితం చేస్తూ ఉన్నారని - ఓట్లను కొని వారు గెలవాలని చూస్తున్నారని ఉప్పీ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాకీయ పార్టీ అంటూ ఉపేంద్ర కొన్నాళ్లుగా రాజకీయ నేత అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే.  ఆయన ముందుగా పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్టీ నుంచి తనే రాజీనామా చేసి బయటకు వచ్చారు. మళ్లీ మరో పార్టీని ఏర్పాటు చేసి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో దాన్ని పోటీకి పెట్టారు. ఈ నేపథ్యంలో తన పార్టీ అభ్యర్థుల తరఫున ఉప్పీ ప్రచారం చేస్తూ.. రాజకీయం చెడిపోయిందని ధ్వజమెత్తుతున్నారు.

బ్రిటీష్ వారు ఇండియాను విడిచిపెట్టి వెళ్లాకా - ప్రజలను వేధించే పనిని రాజకీయ నేతలు తీసుకున్నారని.. వారు సక్రమంగా పని చేస్తూ ఉంటే తనలాంటి వాడు పార్టీని పెట్టాల్సిన అవసరం ఉండేది కాదని ఉపేంద్ర అంటున్నారు. అవినీతి నిర్మూలనకే తను రాజకీయ పార్టీని పెట్టినట్టుగా ఉపేంద్ర చెప్పారు.

మొత్తానికి ఉపేంద్ర ఆదర్శాలు బాగానే ఉన్నాయి కానీ.. సినీ ఛరిష్మాతో రాజకీయం చేసే ప్రయత్నంలో ఉన్న ఈ హీరో రాజకీయానికి అంత ఊపు రావడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ కూటమి - బీజేపీలు ఢీ అంటే ఢీ అంటుండగా.. వారి మధ్యన ఉప్పీ నలిగిపోతున్నట్టుగా ఉన్నాడు!
Tags:    

Similar News