రమ్య మరోసారి నోటికి పని చెప్పారు!

Update: 2016-08-31 04:09 GMT
సంచలన వ్యాఖ్యలు చేయడంలో నిన్నటివరకూ బీజేపీ ఎంపీలు ముందుకు దూసుకుపోతుంటే.. తాజాగా సినీనటి - కర్ణాటక కాంగ్రెస్ నాయకురాలు రమ్య కూడా వారికి ఏమాత్రం తిసిపోనని - వచ్చింది సినీ నటిగా అయినా.. పూర్తిస్థాయి రాజకీయ నాయకులు చేసే విమర్శలవంటివి అత్యంత అద్భుతంగా చేయగలనని మరోసారి నిరూపించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే.. పాకిస్థాన్ నరకం కాదని సంచలన వ్యాఖ్యలు చేసిన రమ్యపై ఇప్పటికే దేశద్రోహం కేసు నమోదవడం, ఈమె విమానాశ్రయంలో కనిపించగానే కోడిగుడ్లతో దాడి చేయడం వంటి సంఘటనలు జరగడం తెలిసిందే.

ఈ వేడి ఇంకా చల్లారకముందే రమ్య మరోసారి మాటల తూటాలు పేల్చారు. ఆర్‌ ఎస్‌ ఎస్‌ - బీజేపీ ల వల్ల దేశానికి స్వాతంత్య్రం లభించలేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల - ఆ పార్టీ చేసిన అలుపెరగని పోరాటాల వల్ల మాత్రమే స్వాతంత్య్రం లభించిందని అన్నారు. అక్కడితో ఆగితే ఇంక తన గొప్పతనం ఏముంది అనుకున్నారో ఏమో కానీ.. మరో బలమైన పదం ఈ విమర్శలకు జోడించారు. స్వాతంత్ర పోరాట సమయంలో కాంగ్రెస్ ఒకవైపు స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తుంటే.. మరోపక్క బీజేపీ - ఆర్‌ ఎస్‌ ఎస్ లు ఆంగ్లేయులతో కలిసిపోయారని ఆరోపించారు. శృతిమించిన ఈ వ్యాఖ్యలపై ఎలాంటి దుమారం రేగనుందో - దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందించనున్నారో వేచి చూడాలి.

మండ్య పట్టణంలో భారత రాష్ట్రీయ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన "విద్యార్థిగళ నడె దేశద బెళవణిగె కడె" ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలసి 3,500 అడుగుల పొడవైన జాతీయజెండాను ప్రదర్శించారు. ఆ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు స్వతహాగా "నటి" కూడా అయిన ఆమెను చూడడానికి - ఆమెతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు.
Tags:    

Similar News