పవన్ కోసం నాయకులను వెతుకుతున్న అభిమానులు

Update: 2016-08-30 10:38 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్నప్రజాభిమానం తక్కువ కాదు... అలా అని ఎన్నికల్లో దిగితే ఆయన పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందా అంటే అవునని సమాధానం చెప్పలేం. ఎందుకంటే ఎన్నికలంటే ఒక్క వ్యక్తి ప్రభావంతో జరిగేవి కాదు.. గ్రామగ్రామాన వ్యవస్థ ఉండాలి. ఇప్పటికే బలపడిన రాజకీయ పార్టీల మాదిరిగా సువ్యవస్థీకృతమైన క్యాడర్ ఉండాలి. ప్రజలతో సంబంధం ఉన్న నాయకులుండాలి.. అవసరమైతే ఎంతయినా ఖర్చు చేసే దమ్ముండాలి. అన్నిటికీ మించి ఓటర్లను పోలింగు బూత్ ల వరకు తీసుకొచ్చే బాధ్యత తీసుకునేవారుండాలి. నాయకులు - క్యాడర్ అంతా కలిస్తేనే ఎన్నికల్లో విజయం దక్కుతుంది. ఈ సూత్రం నుంచి దూరంగా వెళ్లడం వల్ల గతంలో మంచి ఆదరణ ఉన్నా కూడా చిరంజీవి సీట్ల సాధనలో బోల్తా పడ్డారు. అప్పుడు అన్న చేసిన తప్పు తాను చేయకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడుతున్నట్లుగా ఉంది. మొన్నమొన్నే తిరుపతిలో సభ పెట్టిన ఆయన రాష్ర్ట్రంలో మంచి వ్యక్తులు నాయకులను తన పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.  అలాంటివారిని గుర్తించే పనిని అభిమానులకే అప్పగించినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే కోస్తా జిల్లాల్లో సందడి మొదలైంది. నరసాపురం నియోజకవర్గంలో పవన్‌ అభిమానులు ఇప్పటికే ఓ నేత పేరును పవన్ వద్ద సూచించినట్లు వినిపిస్తోంది.  నరసాపురంలో ఏ పార్టీతోనూ సంబంధం లేని ప్రముఖ వైద్యుడు కోటేశ్వరరావు పేరును అభిమానులు పవన్ కు సూచించినట్లు తెలుస్తోంది. ఆయన గతంలో పవన్ అభిమానులు చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలున్నాయి. అలాగే నరసాపురం చైర్‌ పర్సన్‌ రత్నమాల సోదరుడు కొవ్వలి నాయుడు పేరును కూడా అభిమానులు తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. టీడీపీతో ఆయనకు అనుబంధం ఉంది.

ఇలా అన్ని జిల్లాల్లోనూ ప్రజలతో సంబంధాలున్న నేతలు - వివాదాస్పదం కానివారిని గుర్తించే పనిలో అబిమానులు తలమునకలుగా ఉన్నట్లు సమాచారం. తొలుత జిల్లాలవారిగా ప్రత్యేక హోదా సభలు పెట్టి ప్రజల రెస్పాన్సు చూసుకుని కార్యాచరణ వేగవంతం చేయాలని పవన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న తన అభిమానుల్లో మంచి నేతలెవరైనా ఉన్నా వారిని తన పార్టీలోకి తెచ్చుకుని ప్రాధాన్యం ఇవ్వాలన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికైతే కోస్తాలో గబ్బర్ సింగ్ గట్టి స్కెచ్చే వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
Tags:    

Similar News