ప్రాంతీయ వివ‌క్ష‌పై మోడీ మాట్లాడ‌డ‌మా?

Update: 2018-05-27 11:34 GMT
కేంద్రంలో ఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ద‌క్షిణాదిపై చిన్న‌చూపు చూస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. నిధుల కేటాయింపులు - ప్రాజెక్టులు - రైల్వే జోన్లు-లైన్లు - బ‌డ్జెట్ కేటాయింపులు...ఆఖ‌రికి కేంద్ర కేబినెట్ లో చోటు ఇలా దాదాపుగా అన్ని విష‌యాల్లో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతోంది. న‌రేంద్ర‌మోదీ ప్ర‌ధాని అయిన త‌ర్వాత ఆ ప్రాంతీయ వివ‌క్ష మ‌రింత పెరిగిపోయింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌ని తిరుమ‌ల వెంక‌న్న సాక్షిగా హామీ ఇచ్చిన మోదీ దానిని తుంగ‌లో తొక్కారు. అయితే, చెప్పే మాట‌ల‌కు చేసే ప‌నుల‌కు పొంత‌న ఉండ‌ద‌న్న త‌ర‌హాలో మోదీ త‌న‌ తాజా ప్ర‌సంగం ద్వారా మ‌రోసారి నిరూపించారు.  కులం - మతం - ప్రాంతం - ఆర్థిక స్థితిగతుల ప్ర‌కారం రాష్ట్రాల‌లో మౌలిక సదుపాయాల క‌ల్ప‌న విష‌యంలో తేడాలుండ‌కూడ‌ద‌ని మోదీ అన్నారు. ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వే మొదటి దశను - ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించిన సంద‌ర్భంగా మోదీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.  

9 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వే మొదటి దశను, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వేను మోదీ నేడు ప్రారంభించారు. ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వేను రూ.11,000 కోట్ల వ్య‌యంతో 500 రోజుల్లో పూర్తి చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండకుండా దానిని నిర్మించడం విశేషం. ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వే దేశంలో 14 లేన్లతో ఉన్న తొలి హైవే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ మెగా ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేయ‌డం విశేషం. భాగ్ పట్ లో ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం త‌ర్వాత మోదీ ప్ర‌సంగించారు. త‌మ స‌ర్కార్ అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేప‌ట్టింద‌ని అన్నారు. తాను అధికారంలోకి రాక ముందు దేశంలో  2 మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలున్నాయ‌ని మోదీ అన్నారు. తాను అధికారం చేప‌ట్టాక `మేక్ ఇన్ ఇండియా` కార్యక్రమం ద్వారా వాటి సంఖ్య 120కు పెరిగిందని అన్నారు. కులం - మతం - ప్రాంతం - ఆర్థిక స్థితిగతుల ఆధారంగా మౌలిక సదుపాయాల్లో తేడాలుండ‌కూడ‌ద‌ని అన్నారు.

అయితే, ప్రాంతీయత‌త్వంపై మోదీ చెప్పిన మాట‌లు హాస్యాస్పదంగా ఉన్నాయ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఏపీకి తీర‌ని అన్యాయం చేసిన మోదీ నోటి నుంచి ఈ త‌ర‌హా మాట‌లు వినాల్సి రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్రాంతీయ‌త‌త్వం గురించి ఇంత నిస్సిగ్గుగా మాట్లాడే ప్ర‌ధాని మ‌రొక‌రు ఉండ‌ర‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు స‌హా ఏపీకి నిధుల విడుద‌ల‌లో విపరీత‌మైన నిర్ల‌క్ష్యం చూపించిన మోదీ శ్రీ‌రంగ నీతులు చెప్పడం ...దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుంద‌ని మండిప‌డుతున్నారు. ప్రాంతీయ వివ‌క్ష‌ మంచిది కాద‌ని క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్ప‌డం ఒక్క మోదీకే చెల్లింద‌ని సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News