నాయిని ఆమెను అనవసరంగా ‘టచ్’ చేశారా?

Update: 2016-01-16 05:22 GMT
కీలకస్థానాల్లో ఉన్న వారు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. తొందరపడితే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యస్థానాల్లో ఉన్నప్పుడు చాలానే సమాచారం ఫీడ్ బ్యాక్ రూపంలో వస్తుంది. అయితే.. తమకు అందే సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలే కానీ తొందరపడి మాట అనేయకూడదు. కానీ.. ఎవరి మాటల్ని విన్నారో కానీ తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్రవ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. సమర్థమైన అధికారిణిగా.. నిజాయితీగా వ్యవహరిస్తారని.. కంటోన్మెంట్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఆమెను.. ‘‘తీరు మార్చుకోవాలి. లేకుంటే ఢిల్లీకి వెళ్లిపో’’ అంటూ బహిరంగంగా నాయిని చేసిన వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు.. అధికారులు.. కార్మికులు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈవో వ్యవహరిస్తున్న సుజాత గుప్తాపై నాయిని తీవ్ర స్థాయిలో మండిపడటం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల అనంతరం.. స్థానిక టీఆర్ఎస్ నాయకులు సైతం సుజాతను వెనకేసుకురావటం గమనార్హం. సొంత పార్టీ నేతలు మొదలు మిగిలిన రాజకీయ పక్షాలు.. ఉద్యోగ సంఘాల వారు హోంమంత్రి వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నారు. ఎవరో చెప్పిన మాటల్ని విని ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నాయిని వ్యాఖ్యల నేపథ్యంలో.. ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా కంటోన్మెంట్ కార్యక్రమానికి నాయిని ఎలా హాజరయ్యారన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది.  కంటోన్మెంట్ బోర్డు నిధులతో నిర్మిస్తున్న మంచినీటి పైపులైన్ పనుల శంకుస్థాపనకు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి ఏ హోదాలో పాల్గొన్నరన్న ప్రశ్న తలెత్తుతోంది. మొత్తంగా కీలక అధికారిణి విషయంలో తలదూర్చిన నాయిని లేనిపోని సమస్యల్నికొని తెచ్చుకున్నారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News