బాబుతో అమీతుమీకి రెడీ అవుతున్న ముద్రగడ

Update: 2017-05-27 07:23 GMT
చంద్రబాబుకు గత రెండేళ్లుగా ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువల నీళ్లు తాగించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి తన మార్కు ఉద్యమంతో చంద్రబాబుకు చుక్కలు చూపించడానికి సిద్ధమవుతున్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశాన్ని టీడీపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందనే కారణంతో ఆయన తాజాగా ‘చలో అమరావతి' కార్యక్రమం నిర్వహించబోతున్నారు.
    
ముద్రగడ చేపట్టిన ఉద్ధృత కాపు ఉద్యమానికి రానున్న జూలై 26తో  రెండేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 26న తన స్వగ్రామం కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. కాపుల రిజర్వేషన్ల అంశంపై వేసిన మంజునాథ కమిటీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించిందని... అయినా, చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాసినా... కనీస స్పందన కూడా రాలేదని అన్నారు.
    
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో కాపులపై చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. తమ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను నేరుగా చంద్రబాబుకే పంపిస్తామని చెప్పారు.  కాగా గతంలో ముద్రగడ ఉద్యమించినప్పుడు, దీక్షలు చేసినప్పుడు జరిగిన ఘటనలు, పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు, టీడీపీ వెంటనే అలర్ట్ అవుతున్నాయి. ముద్రగడ ప్రభావానికి లోనవకుండా కాపు నేతలను, కాపు యువతను కంట్రోల్ చేయడానికి ఆ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ మంత్రులు , నేతలను రంగంలోకి దించడానికి రెడీ అవుతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News