యూపీ, బెంగాల్ ఎన్నిక‌ల‌పై ఎంఐఎం క‌న్ను.. పొత్తులు-పోటీల‌కు సై!

Update: 2021-02-21 17:30 GMT
హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం.. పార్టీని దేశ‌వ్యాప్తంగా విస్త‌రించేందుకు ప‌క్కా వ్యూహంతో పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే కొన్నాళ్ల కింద‌ట బిహార్ ఎన్నిక‌ల్లో పోటీ చేసి.. కీల‌క‌మైన నాలుగు స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసింది. అదేవిధంగా ఇప్పుడు త్వ‌ర‌లో నే జ‌ర‌గ‌నున్న ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై కూడా అస‌దుద్దీన్ దృష్టి పెట్టారు. అదేవిధంగా వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఉత్త‌ర ప్ర‌దేశ్‌(యూపీ) ఎన్నిక‌ల‌పైనా ఆయ‌న ఇప్ప‌టి నుంచే స‌మాలోచ‌న‌లు చేస్తున్నా రు. పొత్తుల దిశ‌గా కూడా అస‌దుద్దీన్ అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

విష‌యంలోకి వెళ్తే.. ఎంఐఎంను దేశ‌వ్యాప్తం చేయాల‌నే ఆకాంక్ష‌తో అస‌దుద్దీన్ దూకుడుగా ఉన్న విష యం తెలిసిందే. మ‌రో రెండు మాసాల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనిపై ఆయ‌న దృష్టి పెట్టారు. మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వం మైనారిటీల‌కు అన్యాయం చేస్తోంద‌ని.. సీఏఏ విష‌యంలో లోపాయి కారీగా బీజేపీతో స‌హ‌క‌రిస్తోంద‌ని.. కొన్నాళ్లుగా అస‌దుద్దీన్ విమ‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగాల‌ని అస‌దుద్దీన్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. నేరుగా రంగంలోకి దిగే బ‌దులు.. స్థానిక పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగితే బెట‌ర‌ని అనుకున్నారు.

బెంగాల్‌లో అబ్బాస్ సిద్దిఖీ ఆధ్వర్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)తో పొత్తును దాదాపు ఖరారు చేసుకున్నారు. దాదాపు రెండు నెలలుగా సాగుతోన్న పొత్తు చర్చలు కొలిక్కి వచ్చాయని తెలు స్తోంది. ఈ నెల 25న కోల్‌క‌తాలో నిర్వహించబోయే భారీ ర్యాలీలో మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ దీనిపై ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. అసదుద్దీన్ బెంగాల్ లో తన తొలి ఎన్నికల ర్యాలీని డైమండ్ హార్బర్(మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లోక్‌స‌భ‌ స్థానం) నుంచే ప్రారంభిస్తుండటం రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మార‌డం విశేషం. మ‌రి ఈ ప్ర‌య‌త్నం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.

మ‌రోవైపు.. అతి పెద్ద రాష్ట్రం.. పైగా మైనార్టీ వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్న యూపీపై అస‌దుద్దీన్ వ్యూహం మ‌రిం త ఆస‌క్తిగా ఉంది. ఇక్క‌డి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం స‌మాజ్ వాదీ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ములాయం సోద‌రుడు.. శివ‌పాల్ సింగ్ యాద‌వ్ సొంత పార్టీ ప్ర‌గ‌తి శీల స‌మాజ్ వాదీపార్టీతో పొత్తు పెట్టుకుని.. ముందు కుసాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఎంఐఎం యూపీ శాఖ అధ్య‌క్షుడు షౌక‌త్ అలీ కుమార్తె వివాహ వేడుక‌కు వెళ్లిన అస‌దుద్దీన్‌.. ఈ సంద‌ర్భంగా శివ‌పాల్ తో ఎన్నిక‌ల పొత్తుపై చ‌ర్చించార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి.

యూపీ ఎన్నిక‌ల‌కు చాలా స‌మ‌యం ఉంది. అయితే.. వ‌చ్చే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా దెబ్బతీయాలంటోన్న శివపాల్ యాదవ్.. ఇత‌ర పార్టీల‌తో చేతులు క‌లిపేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఎంఐఎం ఆయ‌న‌ను సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. స్థానిక మైనార్టీల్లో ఎంఐఎంకు గుర్తింపు ఓటు బ్యాంకు కూడా ఉండ‌డంతో ఇటు త‌మ‌కు కూడా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని.. శివ‌పాల్ వ‌ర్గం భావిస్తోంది. ప్ర‌స్తుతం త‌న అన్న కుమారుడు, మాజీ సీఎం అఖిలేష్‌తో విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల నాటికి స‌ర్దుకుంటాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే  ఈ నేప‌థ్యంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు ఇది ఉభ‌యుల‌కూ స‌రైన వ్యూహ‌మేన‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.  మ‌రి ఎంఐఎం వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News