రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో టీడీపీ నాశనమైందా?

Update: 2016-04-30 09:21 GMT
    తెలంగాణ టీడీపీకి గుడ్ బాయ్ చెప్పేసి కారెక్కిపోయిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇప్పటికీ టీడీపీ వ్యవహారాలపై దృష్టి పెట్టడం మానడం లేదు. వదిలేసిన పార్టీలో వ్యవహారాలను ఆయన ఇంకా పట్టించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఆ క్రమంలోనే ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణ టీడీపీ నాశనమైపోయిందని మాధవరం తాజాగా ఆరోపించారు.  తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ప్రత్యేక భద్రత ఏమీ అవసరం లేదని మాధవరం అంటున్నారు.

 ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం రేవంత్ కు అలవాటేనని మాధవరం ఆరోపించారు.  కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పురుడుపోసుకున్న టీడీపీ... ఇప్పుడు ఆ పార్టీతో కలిసి ఎలా పనిచేస్తుందని మాధవరం ప్రశ్నించారు. ఇదంతా బాగానే ఉన్నా టీడీపీ ఎందుకు నాశనమైందని.. ఎలా నాశనమైంది అన్న విషయాలు టీఆరెస్ లో ఉన్న మాధవరానికి ఎందుకని రేవంత్ అనుచరులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు... తనకు గట్టి భద్రత కల్పించాలని రేవంత్ కోరితే మాధవరం ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో తెలియడం లేదని అంటున్నారు.

తనకు బెదిరింపు కాల్సు వస్తున్నాయని... తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతపై తనకు నమ్మకం లేదని, కేంద్ర భద్రత కావాలని కోరుతూ రేవంత్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే మాధవరం తాజా వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News