మీ దగ్గరకు వస్తే మంచోళ్లేలే కిషన్ రెడ్డి గారూ!

Update: 2019-08-10 06:40 GMT
'ఒక బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు..' అని వివేక్ కు కితాబిచ్చారట కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి.  కాంగ్రెస్ నుంచి వివేక్ వచ్చి చేరడంపై కిషన్ రెడ్డి ఇలా స్పందించారు.  కాంగ్రెస్ సీనియర్ నేతగా గతంలో చలామణి అయిన జి.వెంకటస్వామి అలియాస్ కాకా తనయుడి బీజేపీ చేరికపై కిషన్ రెడ్డి ఇలా స్పందించారు.

ఇన్నేళ్లూ భారతీయ జనతా పార్టీ వాళ్లకు కాంగ్రెస్ నేతలంటే మంట. వారు ఏం చేసినా తప్పే. అందులోనూ భారీ వ్యాపారస్తులుగా ఎదిగిన కాంగ్రెస్ నేతలను బీజేపీ వాళ్లు మరింతగా విమర్శించేవాళ్లు. అలాంటి విమర్శలను వెంకటస్వామి విషయంలోనూ బీజేపీ వాళ్లు అనేకం చేశారు గతంలో.

కాంగ్రెస్ పవర్లో ఉన్న కాలంలో అలాంటి వారిపై బీజేపీ అనేక విమర్శలతో చెలరేగేది. అయితే శంఖువులో పోస్తే తీర్థం అవుతుందన్నట్టుగా.. భారతీయ జనతా పార్టీలోకి చేరితే ఎవరైనా మంచోళ్లు అయిపోతారు. వారు గతంలో ఏం చేసి ఉన్నా, వారిని బీజేపీ ఎన్ని రకాలుగా విమర్శించి ఉన్నా, ఇప్పుడు వాళ్లు బీజేపీలోకి చేరారు కాబట్టి..వారు ఉత్తమోత్తములు, గొప్ప వారు అవుతారు. అనేక పార్టీలు మారి ఇప్పుడు తమ వద్దకు వచ్చిన వివేక్ విషయంలో కిషన్ రెడ్డి స్పందిస్తున్న తీరు అలానే ఉందని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News