పొత్తుల విష‌యంలో..జేసీ రెండు క‌ళ్ల సిద్ధాంతం

Update: 2018-08-28 14:32 GMT
రెండు క‌ళ్ల సిద్ధాంతం అంటే ఎవ‌రు గుర్తుకు వ‌స్తారో ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ అధినేత‌ - అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు ప్ర‌వ‌చించిన సిద్ధాంతం ఇది. ఒక ప్ర‌త్యేక‌మైన స్టాండ్ అంటూ లేకుండా...ఇటు ఏపీలో ఏపీ మాట‌, అటు తెలంగాణ‌లో అందుకు త‌గిన మాట మాట్లాడే నాయ‌కుడిగా ముద్ర‌ప‌డ్డారు. అయితే, ఆయ‌న స్టాండ్‌ను ఆ పార్టీ నేత‌లు ఇంకా కొన‌సాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్న అనంత‌పురానికి చెందిన జేసీ దివాక‌ర్‌ రెడ్డి ముంద‌స్తు ఎన్నిక‌లు - పొత్తుల‌పై ఇదే రీతిలో స్పందించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పొత్తులు, కలిసి పోటీ చేసే విషయాలపై జోరుగా చర్చ సాగుతుండ‌గా.....దీనిపై మాత్రం పొత్తుల‌పై త‌న‌దైన శైలిలో ట్విస్ట్ ఇచ్చారు.

ముంద‌స్తు, పొత్తుల గురించి జేసీ స్పందిస్తూ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో టీడీపీ లేదని ఇక్క‌డ పొత్తులు త‌ప్ప‌వ‌ని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీ మద్దతు కోరుతోందని తెలంగాణలో కాంగ్రెస్‌ కి మద్దతు ఇస్తే తప్పులేదని ఆయ‌న సూత్రీక‌రించారు. అయితే ఆంధ్రలో కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. త‌ద్వారా త‌మ పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం ఎలా ఉండేదో ఈ నేత చాటిచెప్పారు. రాష్ట్రాన్ని దెబ్బ తీయడంలో అందరి పాత్ర ఉందన్న జేసీ... తెలంగాణలో పొత్తును ఏపీ ప్రజలు హర్షిస్తారని... కానీ, ఏపీలో అవసరం లేదన్నారు. ఈ రూపంలో త‌మ నాయ‌కుడి పొత్తుల ఎత్తుగ‌డ‌కు జేసీ మ‌ద్ద‌తు ఇచ్చారు.  విభజన పాపం కాంగ్రెస్ - టీడీపీ రెండింటిందన్న జేసీ.... పొత్తుల విషయంలో ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరన్నారు.ఏపీ గురించి స్పందిస్తూ కాంగ్రెస్ పొత్తుకు సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``నాలుగేళ్లు బీజేపీని నమ్మి చూశాం... బీజేపీని నమ్మి మోసపోయాం.అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. కాంగ్రెస్ ని నమ్మి చుస్తే తప్పేముంది?` అని జేసీ దివాకర్‌ రెడ్డి ప్రశ్నించారు.  కేంద్రంలో అధికారం మారితేనే పోరాటాలకు ఫలితం ఉంటుందని జేసీ అన్నారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లోని ముంద‌స్తుపై జేసీ త‌న‌దైన శైలిలో స్పందించారు. ముందస్తు ఎన్నికలకు పోవడం కేసీఆర్ రాజకీయ కుయుక్తిగా జేసీ అభివర్ణించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో టీఆర్ ఎస్ పొత్తు ఉంటుందని అంచనా వేసిన ఆయన... ముస్లింల ఓట్లు దూరం అవుతాయనే...అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుకు వెళుతున్నారని ఆరోపించారు. ముంద‌స్తు విష‌యంలో కాల‌మే స‌మాధానం చెప్తుందన్నారు.


Tags:    

Similar News