కోడికత్తి వెనుక బాబు స్క్రిప్ట్‌ ను బయటపెట్టిన జగన్

Update: 2018-11-17 14:37 GMT
విశాఖ విమానాశ్రయంలో కత్తి దాడికి గురైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన రెడ్డి ఆ ఘటనపై స్పందించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పాదయాత్రలో భాగంగా మాట్లాడిన ఆయన చంద్రబాబు అన్యాయమైన పాలనను ప్రశ్నించినందుకు తనను చంపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. హత్యాయత్నం చేసింది తన అభిమానంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్ చంద్రబాబుకు సన్నిహితుల్లో ఒకరని చెప్పారు. దాడి జరిగిన గంటకే స్క్రిప్ట్ ప్లే చేశారని - చంద్రబాబు స్క్రిప్ట్‌ ను డీజీపీ చదివారని జగన్ అన్నారు..
    
దాడి జరిగిన సమయంలో నిందితుడి దగ్గర ఎలాంటి లెటర్ లేదని.. ఆ తరువాతే దాన్ని సృష్టించారన్నారు. నిజంగా అది నిందితుడి జేబులోనే దొరికితే దానిపై మడతలు ఉండాలని.. కానీ, ఆ లేఖ మడతలు పడి లేదని గుర్తుచేశారు. టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా ఫ్లెక్సీలో విజయమ్మ ఫొటో లేదని - గరుడపక్షి ఫొటో ఉందన్నారు. తాను విశాఖలో అడుగు పెట్టినప్పుడే సీసీ కెమెరాలు ఆగిపోయానని.. అయితే, హత్యాయత్నం జరిగిన వెంటనే తెలిసీ తెలియకుండా అభాండాలు వేయడం సరికాదని తాను ఎవరిపైనా వెంటనే ఆరోపణలు చేయలేదని తెలిపారు. అప్పటికప్పుడు చొక్కా మార్చుకుని బయల్దేరానని చెప్పారు. ఎవ్వరూ కంగారుపడొద్దని ట్వీట్ చేశానని జగన్ స్పష్టం చేశారు.
   
ఎయిర్‌ పోర్టులో తనపై హత్యాయత్నం, కుట్ర చేయకపోతే స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఎందుకు ఒప్పుకోరని జగన్ ప్రశ్నించారు. కుట్రలను తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వుతున్నారని జగన్ విమర్శించారు. సీబీఐ విచారణ జరిగితే నేరుగా జైలుకి వెళ్తారని చంద్రబాబు వణికిపోతున్నారని జగన్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News