మమతపై బీజేపీ నేత అసభ్య వ్యాఖ్యలు..!

Update: 2021-03-25 04:00 GMT
నోరు పారేసుకోవడం.. ఆ తర్వాత సారీ చెప్పడం ఇటీవల బీజేపీ నేతలకు అలవాటుగా మారిపోయింది. తరచూ మహిళల డ్రెస్సింగ్ గురించి - ఆహార నియమాల గురించి బీజేపీ నేతలు ఏదో ఒక  వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. బీజేపీ నేతల వివాదాస్పద మాటలు నిత్యకృత్యమయిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా బీజేపీకి చెందిన ఓ నేత పశ్చిమబెంగాల్​ సీఎం మమతా బెనర్జీపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల నిర్వహించిన ఓ ప్రచార కార్యక్రమంలో మమతా బెనర్జీ గాయపడ్డ విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె వీల్​చైర్​ పై నుంచే ప్రచారం చేస్తున్నారు. అయితే మమతా బెనర్జీపై బీజేపీ నేతలే దాడి చేశారంటూ అప్పట్లో తృణమూల్​ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బీజేపీ నేతలు మాత్రం మమత కావాలనే డ్రామాలు చేస్తుందని మండిపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా బెంగాల్ ​కు చెందిన దిలీప్​ ఘోష్ మమత పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘ ఓ మహిళా నేత ప్రస్తుతం తన కాలికి గాయం అయ్యిందంటూ వీల్​ చైర్​ పై తిరుగుతున్నారు. ఆమె షార్ట్​ (బెర్ముడా) వేసుకుంటే కాలి గాయం చాలా క్లియర్​గా కనిపిస్తుంది కదా’ అంటూ నోరుపారేసుకున్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

మమతపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను పలువురు మహిళలు ఖండించారు. అతడి వ్యాఖ్యలు చాలా హేయంగా ఉన్నాయని మండిపడ్డారు. టీఎంసీ పార్టీకి చెందిన మహిళా విభాగం నేతలతో పాటు .. ఇతర మహిళలు కూడా బీజేపీ నేత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు వీడియోలో దిలీప్‌ ఎవరిపేరును నేరుగా ప్రస్తావించకపోయినా, అది మమత గురించేనని అంతా భావిస్తున్నారు.

ఇలాంటి నీచమైన మాటలు దిలీప్‌ నుంచే వస్తాయని టీఎంసీ ఒక ట్వీట్‌ లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను ఇంతగా వివాదాస్పదం చేయాల్సిన పనిలేదని బీజేపీ ప్రతినిధి షమిక్‌ అన్నారు. మమతా బీజేపీ నేతలపై ఇంతకంటే నీచంగా మాట్లాడారని పేర్కొన్నారు. పలువురు విశ్లేషకులు మాత్రం ఈ వ్యాఖ్యలు బీజేపీకి నష్టం చేస్తాయని వ్యాఖ్యానించారు. బెంగాల్ ​కు చెందిన మహిళను అవమానించడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు సహించలేకపోవచ్చని పేర్కొన్నారు.
Tags:    

Similar News