అమరావతికి వెళ్లాల్సిన డేట్ ఫిక్స్ అయ్యింది

Update: 2016-05-26 05:13 GMT
హైదరాబాద్ లోని ఏపీ సచివాలయ ఉద్యోగులే కాదు.. ఏపీకి సంబంధించిన వివిధ విభాగాలు సైతం భాగ్యనగరాన్ని వీడాల్సిన డేట్ ఫిక్స్ అయ్యింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో అనివార్యమైన ఈ బదిలీ ఇప్పట్లో ఉండదని మొదట్లో అనుకున్నా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది బెజవాడకు షిఫ్ట్ అయిపోవటం.. పాలనా వేగం మరింత పెంచేందుకు వీలుగా సచివాలయాన్ని ఏపీ రాజధాని అమరావతికి తరలించాలన్న నిర్ణయం తీసుకున్నారు. జూన్ చివరి నాటికి ఏపీ సచివాలయం.. హైదరాబాద్ లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అమరావతికి తరలించేందుకు జూన్ 26ను కటాఫ్ గా నిర్ణయించారు. జూన్ 27నాటికి అన్ని విభాగాలు (విభజన చట్టం షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థలు మినహా)  అమరావతికి వచ్చేయాలని తాజాగా అధికారిక ఆదేశాలు జారీ చేశారు.

వివిధ శాఖలకు అవసరమైన కార్యాలయాల ఏర్పాటు కోసం గుంటూరు.. విజయవాడ కలెక్టర్లను సంప్రదించాలని స్పష్టం చేసిన ఏపీ సర్కారు.. విజయవాడ.. గుంటూరులో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భవనాల్ని వెతికి ఉంచారని.. ఈ భవనాల్లో తమకు సూట్ అయ్యే వాటిని ప్రభుత్వ విభాగ అధినేతలు మూడేళ్ల వరకూ కాంట్రాక్ట్ మీద అద్దెకు తీసుకోవాలని ఏపీ సర్కారు స్పష్టం చేసింది.

కార్యాలయాల్ని తరలించేందుకు అనుకూలంగా ఉన్న దాదాపు 85 భవనాల్ని గుంటూరు.. విజయవాడ కలెక్టర్లు గుర్తించారని.. వీటిల్లో 16.98 లక్షల చదరపు అడుగుల భవనాల విస్తీర్ణం.. 2.34 లక్షల చదరపు అడుగుల పార్కింగ్ స్థలాలు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. విభాగాల తరలింపు.. అక్కడ సర్దుబాటు ప్రక్రియ మొత్తం జూన్ 27 నాటికి పూర్తి చేసుకోవాలన్న ఆదేశాలు జారీ చేశారు. సో.. హైదరాబాద్ లో ఉన్న ఏపీకి చెందిన అన్ని విభాగాలు జూన్ 27 నాటికి మొత్తం ఖాళీ అయిపోతాయన్న మాట.
Tags:    

Similar News