‘అమ్మ’ క్యాంటీన్లపై సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం !

Update: 2021-05-11 05:30 GMT
రాజకీయాల్లో  ఓ పని మాత్రం చాలా కామన్ గా కనిపిస్తుంది. అదేమిటంటే .. ఎన్నికల్లో గెలిచి కొత్త ప్రభుత్వం ఏర్పడటం ఆలస్యం , మొదటగా చేసే పని గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలకు సీల్ వేయడమే. గత ప్రభుత్వం కొన్ని మంచి పథకాలు పెట్టినా సరే  వాటిని కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఆ పథకాల్ని కొనసాగిస్తే ఎక్కడ ప్రతిపక్షానికి పేరొచ్చేస్తుందో అని  ఆపేస్తారు. ఇక తమిళ‌నాడు రాజ‌కీయాలంటేనే, ప్ర‌త్య‌ర్థిని చిత్తు చేసే ఎత్తులు, జిత్తుల‌కు పెట్టింది పేరు. అలాంటి రాజ‌కీయాల్లోనే ఓన‌మాలు దిద్దుకున్న స్టాలిన్,  సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గానే  జ‌నం సంక్షేమాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోని, రాజ‌కీయ క‌క్ష‌సాధింపుల‌ను ఎంత‌మాత్రం స‌హించేది లేద‌న్న రీతిలో త‌న‌దైన శైలి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

ముఖ్యమంత్రిగా  ప్ర‌మాణం చేసిన రోజే పేద‌ల సంక్షేమానికి సంబంధించి ఐదు సంత‌కాలు చేసిన స్టాలిన్‌, తాజాగా సోమ‌వారం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మిళ‌నాట దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత హ‌యాంలో పేద‌ల‌కు రూ.5లకే భోజనం అందించే ఉద్దేశ్యంతో అమ్మ క్యాంటీనన్ పేరిట ప్ర‌త్యేకంగా స‌ర్కారీ క్యాంటీన్ల‌ను ఓపెన్ చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత కూడా ఆమె వార‌సులుగా రాష్ట్రాన్ని పాలించిన ప‌న్నీర్ సెల్వం, ప‌ళ‌ణిసామిలు  ఆ పథకాన్ని కొనసాగించారు. అయితే జ‌య మ‌ర‌ణం త‌ర్వాత జ‌రిగిన తొలి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే ఓట‌మి పాలు కాగా ,స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే విజ‌యం సాధించింది. దీంతో స్టాలిన్ సీఎం ప‌గ్గాలు చేప‌ట్టారు. సాధార‌ణంగా డీఎంకే కొన‌సాగించిన ప‌థ‌కాల‌కు అన్నాడీఎంకే ర‌ద్దు చేయ‌గా , అన్నాడీఎంకే ప్రారంభించిన ప‌ధ‌కాల‌కు డీఎంకే ర‌ద్దు చేస్తూ సాగాయి. ఈ సంప్రదాయాన్ని పక్కన పెడుతూ సీఎం స్టాలిన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న స్టాలిన్‌, అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే పేద‌ల ఆక‌లి తీర్చే అమ్మ క్యాంటీన్ల‌ను ర‌ద్దు చేసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చేశారు. అమ్మా క్యాంటీన్ల‌ను త‌న హ‌యాంలో కూడా కొన‌సాగించ‌నున్న‌ట్లుగా సోమ‌వారం స్టాలిన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అన్నాడీఎంకే పార్టీకి మంచి పేరు, మైలేజీ ఇచ్చిన పథకం ఇది.ఐతే డీఎంకే అధికారంలోకి రాగానే వీటిని ఎత్తేస్తారేమో అని చాలామంది అనుకున్నారు. కానీ కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ పని చేయలేదు. లాక్ డౌన్ వేళ పేదల కడుపు నింపడానికి ‘అమ్మ’ క్యాంటీన్లు ఉపయోగపడతాయని భావించి.. వాటిని కొనసాగిస్తామని ప్రకటించారు స్టాలిన్.  అయితే ,ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అన్ని నగరాలు, పట్టణాల్లో అన్న క్యాంటీన్లు తెరిచి ఐదు రూపాయలకు నామమాత్రపు ధరతో భోజనం పెట్టి పేదల కడుపు నింపుతూ ఉండేది. ఐతే రెండేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టుబట్టి అన్న క్యాంటీన్లను ఆపించేశారు. దాని స్థానంలో వేరే పథకం తెస్తామని, పేదలకు తక్కువ ధరకు భోజనం అందిస్తామని ప్రకటించారు కానీ.. ఆ మాట చెల్లుబాటు కాలేదు. అన్న క్యాంటీన్ భవనాలు నిరుపయోగం అయ్యాయి.
Tags:    

Similar News