ఏపీలో కొత్త జిల్లాలకు రంగం సిద్ధం !

Update: 2020-07-13 08:50 GMT
ఏపీలో గత కొద్దీ రోజులుగా కొత్త జిల్లాల ఏర్పాటు పై రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టినట్టు సమాచారం.  ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల కాస్తా త్వరలోనే 25 జిల్లాలుగా మారనున్నాయి. ఈ నెల 15వ తేదీ జరగనున్న కేబినేట్  సమావేశంలో కొత్త జిల్లాల విభజనపై జగన్  ప్రభుత్వం  అధికారికంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.
 
 ఇక , ఇటీవల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రస్తావన కూడా వచ్చింది.   ఆ సమావేశంలో కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన ఉందని అధికారులకు సీఎం వివరించారు. అయితే , లోక్ సభ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని సీఎం జగన్ చెప్తుండగా దీనిపై సొంత పార్టీలోనే భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇది  సరైన నిర్ణయం కాదు అంటూ ఇప్పటికే కొంతమంది సొంత పార్టీ నేతలే విమర్శలకి దిగారు.  

ప్రభుత్వ అంచనా ప్రకారం కొత్తగా ఏర్పాటయ్యే 12 జిల్లాల్లో 5 జిల్లాల ఏర్పాటుకు ఏ సమస్యలూ లేవు. మిగతా 7 జిల్లాల ఏర్పాటు విషయంలోనే చాలా సమస్యలు వచ్చేలా కనిపిస్తున్నాయి.  అలాగే , అసలు కొత్త జిల్లాలు 25 లేక 26 అనే అంశం కూడా చర్చల్లో ఉంది. ఎందుకంటే... సీఎం జగన్, ప్రత్యేకంగా ఓ గిరిజన జిల్లా ఏర్పాటు చేస్తానని అన్నారు. దీనిపై చర్చ నడుస్తుంది. మొత్తంగా ఇలా పలు అంశాలపై ఈ నెల 15 న జరగబోయే కేబినెట్ భేటీ లో చర్చించి కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని తెలుస్తుంది.
Tags:    

Similar News